‘ములకలపల్లి’ ఘటనపై సమగ్ర విచారణ
ABN , First Publish Date - 2022-01-23T09:11:37+05:30 IST
కట్టెలు సేకరించేందుకు వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ గార్డు దాడికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన, శిశు, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.
మంత్రి సత్యవతిరాథోడ్.. పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్/ములకలపల్లి, జనవరి 22: కట్టెలు సేకరించేందుకు వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ గార్డు దాడికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన, శిశు, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాగివాగు ఆదివాసీగూడేనికి చెందిన నలుగురు మహిళలపై శుక్రవారం అటవీశాఖ గార్డు దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ మేరకు మంత్రి శనివారం హైదరాబాద్లో ఓ ప్రకటన విడుదల చేశారు. జీవనాధారం కోసం అడవిలోకి వెళ్లే ఆదివాసీల జోలికొస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు విచారణ ప్రారంభించారు. కాగా బాధిత మహిళలు వెట్టి లక్ష్మి, సోడే దేవమ్మ, మూడమ్మ, రజనీ శనివారం ములకలపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ నిర్వహిస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్నాయక్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు.