సింగరేణి ప్రమాదంపై సీఎం మాట్లాడలేదు: సీతక్క
ABN , First Publish Date - 2022-03-09T21:09:41+05:30 IST
సింగరేణి ప్రమాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడలేదని ఎమ్మెల్యే సీతక్క నిలదీశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

హైదరాబాద్: సింగరేణి ప్రమాదంపై సీఎం కేసీఆర్ మాట్లాడలేదని ఎమ్మెల్యే సీతక్క నిలదీశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిరుద్యోగులను మరోసారి మోసం చేశారని దుయ్యబట్టారు. సీఎం నిరుద్యోగ భృతిపై మాట్లాడలేదని తప్పుబట్టారు. మాటల వరకేనా.. భర్తీ ఉంటుందా? సీతక్క ప్రశ్నించారు.
రామగుండం రీజియన్లోని ఆర్జీ 3 పరిధిలో గల సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం గని పైకప్పు, సైడ్ ఫాల్ కూలి ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గనిలోకి వెళ్లిన ఏడుగురు సిబ్బందిలో సపోర్ట్మన్ వీరయ్య స్వల్ప గాయాలతో బయటపడగా, ఎఫ్బీఎల్ ఆపరేటర్ జాడి వెంకటేశ్వర్లును, మైనింగ్ సర్దార్ పిల్లి నరేశ్ను సోమవారం రాత్రి రెస్క్యూ టీం కాపాడింది. యంత్రం పక్కన బొగ్గు పెళ్లల మధ్య చిక్కుకున్న నరేశ్ను రాత్రి 1:30 గంటలకు సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. బొగ్గు శిథిలాల మధ్య చిక్కుకున్న నలుగురిలో బదిలీ ఫిల్లర్ వీరవేని రవీందర్ను సహాయక బృందం కాపాడింది.