IT raids on Mallareddy: మల్లారెడ్డిపై ఐటీ సోదాల్లో కీలక పరిణామం

ABN , First Publish Date - 2022-11-24T18:49:26+05:30 IST

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)పై ఐటీ సోదాల్లో మరో ట్విస్ట్‌ నెలకొంది. మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు నిర్ధారించారు.

IT raids on Mallareddy: మల్లారెడ్డిపై ఐటీ సోదాల్లో కీలక పరిణామం

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy)పై ఐటీ సోదాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు నిర్ధారించారు. ల్యాప్‌ట్యాప్‌ వ్యవహారం, అధికారులపై దాడి అంశాలను తీసుకున్నారు. వీటిపై అధికారులు సీరియస్‌ అయ్యారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికతో ఈడీకి ఐటీ లేఖ రాసింది. సేకరించిన సమాచారం, సాక్ష్యాలను ఈడీకి అధికారులు పంపించారు. ఆర్థిక లావాదేవీల అవకతవకలపై పూర్తిస్థాయి వివరాలు తెలియాలంటే.. ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి (Mahender Reddy Bhadra Reddy), అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 50 బృందాలుగా విడిపోయి మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన విషయం విధితమే.

మంగళవారం దాదాపు రూ. 4 కోట్ల నగదును గుర్తించినట్లు పేర్కొన్న ఐటీ అధికారులు.. రెండోరోజూ(బుధవారం) భారీగా నగదు, నగలను సీజ్‌ చేసినట్లు తెలిసింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో గల మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు కండ్లకోయలోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డి, ఆయన భార్యతోపాటు.. కాలేజీల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్‌, ఇతర సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పన్ను చెల్లింపుల్లో అక్రమాలు, అధిక ఫీజుల వసూళ్లు, క్యాష్‌ పేమెంట్ల వివరాలు, వాటిని బ్యాంకుల్లో భద్రపర్చకపోవడానికి కారణాలను ఆరా తీసినట్లు సమాచారం.

2 నెలలుగా నిఘా? డెకాయ్‌ ఆపరేషన్‌?

కాగా ఐటీ అధికారులు రెండు నెలలుగా మంత్రి మల్లారెడ్డి లావాదేవీలపై నిఘా పెట్టినట్లు తెలిసింది. అన్ని ఆధారాలు సేకరించాకే.. వ్యూహాత్మకంగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాలేజీ ఫీజుల వసూళ్లు.. వాటిని స్థిరాస్తులకు మళ్లించడం.. ఇతర వ్యాపారాలు వంటి అంశాలపై అధికారులు ముందుగానే ఓ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకుని, దాడులకు చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం మంత్రి మల్లారెడ్డి భూవ్యవహారాలు చూసే ఓ వ్యక్తిపై డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి బ్లాక్‌ మనీతో ఐటీ అధికారుల వద్ద భూమి కొనేలా డీల్‌ కుదుర్చుకున్నాక.. అన్ని ఆధారాలు సేకరించాకే ఈ దాడులను ప్రారంభించినట్లు సమాచారం.

Updated Date - 2022-11-24T19:04:54+05:30 IST