ఫాంహౌస్లో అనధికార పార్టీ
ABN , First Publish Date - 2022-06-12T09:06:58+05:30 IST
ఫాంహౌస్లో అనధికార పార్టీ
పది మంది విదేశీయులు సహా 15 మంది అరెస్టు
మొయినాబాద్, జూన్ 11: ఎటువంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌ్సలో పార్టీ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పార్టీ నిర్వాహకులు సహా 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో పది మంది విదేశీయులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎ్సలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన కీషబ్ డేవిడ్(28) అనే మహిళ చదువు కోసం హైదరాబాద్కు వచ్చి టోలీచౌకీలో నివాసముంటోంది. శ్రీరాంనగర్ రెవెన్యూలోని న్యూ గ్రీన్ ఫాంహౌ్సలో ‘కూల్ బైదీ కూల్’ పేరిట శుక్రవారం రాత్రి ఓ పార్టీ నిర్వహిస్తున్నట్లు ఆన్లైన్లో ఆమె ప్రకటన చేసింది. పార్టీ ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలని, బీరు ఉచితంగా ఇస్తామని అందులో పేర్కొంది. ఈ మేరకు టికెట్లు కొనుగోలు చేసిన పలువురు పార్టీ కోసం ఫాంహౌస్కు చేరుకున్నారు.
అయితే, ఈ అనధికార పార్టీపై సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు శనివారం తెల్లవారు జామున 2గంటల సమయంలో దాడి చేశారు. పార్టీ నిర్వాహకులు, పార్టీలో పాల్గొన్న వారితోపాటు ఫాంహౌస్ నిర్వాహకుడిని కూడా అరెస్టు చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు, హుక్కా ఫ్లేవర్లతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో టాంజానియా, కెన్యా, కామెరూన్, కాంగో, సూడాన్ తదితర దేశీయులున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.