109.. ఎంసెట్ కేంద్రాలు
ABN , First Publish Date - 2022-07-05T10:33:36+05:30 IST
ఈ ఏడాది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచారు.
ఈ నెల 14 నుంచి ప్రవేశ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్/కేయూ క్యాంపస్, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచారు. గత ఏడాది కంటే అదనంగా ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 85, ఏపీలో 24 సెంటర్లలో పరీక్ష జరుపనున్నారు. ఈ నెల 14న ప్రారంభమై.. 15, 18, 19, 20 తేదీల్లో జరిగే ఎంసెట్కు అఽధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 14, 15వ తేదీల్లో అగ్రి, 18, 19, 20వ తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ను నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం సెషన్ 3 నుంచి 6 గంటల వరకు జరుగనుంది. రాష్ట్రంలో ఎంసెట్కు 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేశారు. 70 శాతం సిలబ్సతోనే ఎంసెట్లో ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఇక, జూలైలో వరుసగా వివిధ ప్రవేశ పరీక్షలున్నాయి. 13న ఈసెట్, అనంతరం ఎంసెట్, లాసెట్, ఎడ్ సెట్, ఐసెట్, సీపీ గెట్ నిర్వహించనున్నారు. ఈ నెల 20న జరిగే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ)కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. రూ.500 ఫైన్తో ఈ నెల 11 దాకా, రూ.2 వేల ఫైన్తో ఈ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్ సెషన్-1ను పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి 30 వరకు సెషన్-2ను నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్ ఆగస్టు 28న జరుగనుంది. సెప్టెంబరు 11న జేఈఈ అడ్వాన్స్ ఫలితాలను ప్రకటించనున్నారు.
ఐసెట్కు అపరాధ రుసుము తగ్గింపు..
ఐసెట్ను ఈ నెల 27, 28న నిర్వహించనున్నారు. రూ.250 అపరాధ రుసుముతో 14వ తేదీ వరకు, రూ.500తో ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా రూ.250 ఫైన్తో ఈ నెల 11 దాకా, రూ.500తో 18 దాకా, రూ.1000తో ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం ఉంది.