వరల్డ్‌ చాంపియన్‌షిప్స్ ట్రయల్స్‌లో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి హడావిడి

ABN , First Publish Date - 2022-08-31T09:23:05+05:30 IST

వరల్డ్‌చాంపియన్‌షిప్స్ కోసం జరుగుతున్న మహిళల ట్రయల్స్‌లో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తీరు...

వరల్డ్‌ చాంపియన్‌షిప్స్ ట్రయల్స్‌లో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి హడావిడి

లఖ్‌నవూ: వరల్డ్‌చాంపియన్‌షిప్స్ కోసం జరుగుతున్న మహిళల ట్రయల్స్‌లో భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తీరు వివాదాస్పదమైంది. ‘సాయ్‌’ సెంటర్‌లో 59 కిలోల బౌట్‌ జరుగుతుండగా.. హఠాత్తుగా ఆపేశారు. సాధారణంగా ఎవరైనా గాయపడితేనో లేదా సాంకేతిక కారణాలవల్లో బౌట్‌ను అర్ధంతరంగా నిలిపేస్తారు. కానీ ఇప్పుడు ఆపడానికి కారణం వేరేవుంది. విషయంలోకి వెళ్తే....ఈ పోటీల్లో పాల్గొంటున్న రెజ్లర్లను ఆశీర్వదించేందుకు కొందరు అయోధ్య సాధువులను ముఖ్య అతిథులుగా పిలిచారు. అలా వచ్చిన సాధువులను మ్యాట్‌పైకి పిలవడం మరిచిపోవడంతో పోటీని ఆపాల్సిందిగా బ్రిజ్‌భూషణ్‌.. రెఫరీని ఆదేశించాడు.


రెజ్లర్లను ఆశీర్వదించి ఫొటోలు దిగిన తర్వాత కొంతసేపటికి పోటీని ఆరంభించారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌.. రెఫరీలకు రూల్స్‌ గురించి సూచనలు ఇస్తూ కనిపించాడు. అంతేకాదు.. ఓ బౌట్‌లో రెఫరీ ఇచ్చిన నిర్ణయం తనకు నచ్చనందున ఆటను ఆపి వీడియో రివ్యూ చేయాలని ఎంపీ కోరాడు. అలాగే ఎంతో సహకారం అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించాలని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. కాగా, ఈ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన అంకుష్‌ (50 కిలోలు), వినేష్‌ (53 కి), సుష్మ షోకీన్‌ (55 కి), సరిత మోర్‌ (57 కి), మాన్సి (59 కి), సోనమ్‌ మాలిక్‌ (62 కి), షఫాలీ (65 కి), నిషా దహియా (68 కి)లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ బెర్త్‌లు కైవసం చేసుకున్నారు. 

Updated Date - 2022-08-31T09:23:05+05:30 IST