వాషింగ్టన్ సుందర్కి కరోనా.. వన్డే సిరీస్ నుంచి ఔట్!
ABN , First Publish Date - 2022-01-11T22:25:55+05:30 IST
దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారినపడ్డాడు
బెంగళూరు: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారినపడ్డాడు. వన్డే జట్టు నేడు దక్షిణాఫ్రికా బయలుదేరాల్సి ఉండగా జట్టు సభ్యులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో సుందర్కు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల 19 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సఫారీలతో తలపడే భారత జట్టులోని 18 సభ్యుల్లో ఒకడైన సుందర్కి కరోనా సోకడంతో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న విషయాన్ని బీసీసీఐ నేడు ప్రకటించే అవకాశం ఉంది.
ఇంగ్లండ్తో గతేడాది స్వదేశంలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత సుందర్ ఇప్పటి వరకు భారత్ తరపున ఆడలేదు. భారత టెస్టు జట్టుతో కలిసి యూకే వెళ్లినప్పటికీ వేలికి గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అంతేకాదు, ఐపీఎల్ 2021 రెండో అంచెతోపాటు సెప్టెంబరు-నవంబరులో జరిగిన టీ20 ప్రపంచకప్కు కూడా సుందర్ దూరమయ్యాడు. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జనవరి 19న పార్ల్లోని బోలాండ్ పార్క్లో జరగనుండగా, 21న అదే స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. 23న కేప్టౌన్లో మూడో వన్డే జరగనుంది.