IPL 2022: బయోబబుల్లోకి ఇద్దరు కానిస్టేబుళ్లు.. కేసు నమోదు
ABN , First Publish Date - 2022-04-14T23:09:20+05:30 IST
ఐపీఎల్ నేపథ్యంలో నీరుల్లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి
ముంబై: ఐపీఎల్ నేపథ్యంలో నీరుల్లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి ప్రవేశించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లకు బయటి వ్యక్తులతో సంబంధాలు లేకుండా ఉండేందుకు బయోబబుల్ను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్-సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నారు.
మద్యం మత్తులో ఉన్న వారిద్దరూ ఇతర పోలీసులు వారిస్తున్నా వినిపించుకోకుండా బయోబబుల్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఇతర పోలీసులతో వారు వాగ్వివాదానికి దిగారు. బయోబబుల్లోకి బలవంతంగా ప్రవేశించిన ఆ ఇద్దరినీ రవీంద్ర మాటే (33), నరేంద్ర నాగ్పురే (36)లుగా గుర్తించారు. 11న రాత్రి 10.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.