Trisha Indian team : భారత జట్టులో త్రిష
ABN , First Publish Date - 2022-12-06T01:08:27+05:30 IST
తొలిసారి జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్లో భారత జట్టుకు తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఎంపికైంది. టీమిండియా టీనేజ్ బ్యాటర్ షఫాలీ వర్మ జట్టు కెప్టెన్గా
అండర్-19 టీ20 వరల్డ్కప్
కెప్టెన్గా షఫాలీ వర్మ
న్యూఢిల్లీ: తొలిసారి జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్లో భారత జట్టుకు తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఎంపికైంది. టీమిండియా టీనేజ్ బ్యాటర్ షఫాలీ వర్మ జట్టు కెప్టెన్గా నియమితురాలైంది. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. కాగా, మెగా ఈవెంట్కు ముందు ఈనెల 17 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్కు కూడా షఫాలీ సారథిగా వ్యవహరించనుంది. టీ20 సిరీస్, వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల బృందాన్ని సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. త్రిషకు ఈ రెండు జట్లలో చోటు దక్కడం విశేషం. ఇక, హైదరాబాద్కే చెందిన మరో అమ్మాయి యశశ్రీ రెండు జట్లకు స్టాండ్బైగా ఎంపికైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న పొట్టికప్ గ్రూప్-డిలో సౌతాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్తో భారత్ ఆడనుంది. టాప్-3లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ ఒక్కో గ్రూప్లో ఆరు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన టీమ్లు సెమీస్కు క్వాలిఫై అవుతాయి.
భారత జట్టు: షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా షెరావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), త్రిష, సౌమ్య తివారి, సోనియా, హర్లీ గాలా, హృషితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, పార్శవి చోప్రా, తిటాస్ సాధు, ఫాలక్ నాజ్, షబ్నమ్, స్టాండ్బై: శిఖా, నజ్లా, యశశ్రీ