Womens T20 Challenge 2022: హర్మన్ప్రీత్ జట్టుపై దీప్తిశర్మ జట్టు ఘన విజయం
ABN , First Publish Date - 2022-05-25T03:13:45+05:30 IST
మహిళల టీ20 చాలెంజ్లో భాగంగా ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సూపర్ నోవాస్తో
పూణె: మహిళల టీ20 చాలెంజ్లో భాగంగా ఇక్కడి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సూపర్ నోవాస్తో జరిగిన మ్యాచ్లో దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్నోవాస్ నిర్దేశించిన 151 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెలాసిటీ ఆరు పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అదరగొట్టింది.
ఓపెనర్ షెఫాలి వర్మ, లారా వోల్వార్ట్ అర్ధ సెంచరీలతో విరుచుకుపడి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. షెఫాలీ 33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో 51 పరుగులు చేయగా, లారా 35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 51 పరుగులు చేసింది. ఫలితంగా 18.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. యస్తికా భాటియా 17, కెప్టెన్ దీప్తిశర్మ 24 పరుగులు చేశారు. సూపర్ నోవాస్ బౌలర్లలో డియేండ్ర డాటిన్కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో 71 పరుగులు చేయగా, తానియా భాటియా 36, సున్లస్ 20 పరుగులు చేసింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్కు రెండు వికెట్లు దక్కాయి. 71 పరుగులు చేసిన నోవాస్ కెప్టెన్ హర్మన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.