IPL 2022: రాహుల్ త్రిపాఠి వీర విహారం.. ముంబై ఎదుట భారీ లక్ష్యం
ABN , First Publish Date - 2022-05-18T03:05:37+05:30 IST
ప్లే ఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్
ముంబై: ప్లే ఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) చెలరేగింది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది.
టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన హైదరాబాద్ 18 పరుగుల వద్ద ఓపెనర్ అభిషేక్ వర్మ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మాత్రం ముంబై బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు చెలరేగారు. ఓవైపు ప్రియం గార్గ్, మరోవైపు రాహుల్ త్రిపాఠి చెలరేగిపోయారు. బంతులను ఎడాపెడా బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ప్రియం గార్గ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి 44 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు పెట్టింది. ప్రియం గార్గ్ అవుటయ్యాక వచ్చిన నికోల్ పూరన్ కూడా బంతిని పరుగులు పెట్టించాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి, మార్కరమ్ (2) పెవిలియన్ చేరారు.
బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వచ్చినప్పటికీ కెప్టెన్ విలియమ్సన్ బ్యాట్ ఝళిపించలేకపోయాడు. 8 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ (9) అవుట్ కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్కు 193 పరుగుల వద్ద తెరపడింది. ముంబై బౌలర్లలో రమణ్దీప్ సింగ్కు మూడు వికెట్లు దక్కాయి.