ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కేఎల్ రాహుల్
ABN , First Publish Date - 2022-01-23T01:16:12+05:30 IST
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ సరసన నిలిచాడు

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ సరసన నిలిచాడు. రాహుల్ను ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో రూ. 17 కోట్లకు సొంతం చేసుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పొందిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
అంతకుముందు 2018లో ఐపీఎల్ వేలానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీకి రూ. 17 కోట్లు చెల్లించింది. ఇప్పటి వరకు అదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును రాహుల్ సమం చేశాడు. కాగా, రాహుల్తోపాటు జట్టులోకి తీసుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్కు రూ. 9.2 కోట్లు, ఇండియన్ అన్క్యాప్డ్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు రూ. 4 కోట్లు చెల్లించేందుకు లక్నో ఒప్పందం కుదుర్చుకుంది.
ఐపీఎల్లో మరో కొత్త జట్టు అయిన అహ్మదాబాద్.. టీమిండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు హార్దిక్ పాండ్యా కోసం కూడా భారీ మొత్తమే చెల్లించింది. రూ. 15 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న అహ్మదాబాద్ అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఆఫ్ఘనిస్థాన్ స్టాల్వార్ట్ రషీద్ ఖాన్కు కూడా అంతే మొత్తం చెల్లించగా, టీమిండియా టెస్ట్ ఓపెనర్ శుభమన్ గిల్కు రూ. 8 కోట్లు చెల్లించింది.
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ. 52 కోట్ల పర్స్తో మెగా వేలంలో పాల్గొననుండగా, లక్నో పర్స్లో ఇంకా రూ. 59.89 కోట్లు ఉన్నాయి. మొత్తంగా 1,214 మంది ఆటగాళ్లు (896 మంది ఇండియన్స్, 318 మంది విదేశీయులు) మెగా వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
వీరిలో 270 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 903 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లు, 41 మంది అసోసియేటెడ్ ప్లేయర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు 27 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. వేలానికి ముందు రెండు కొత్త ప్రాంచైజీలు చెరో ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.