Domakonda Fort: రామ్‌చరణ్-ఉపాసన పెళ్లి జరిగిన ఈ కోటకు అవార్డ్ ఎందుకొచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-11-28T17:52:27+05:30 IST

యునెస్కో (UNESCO) ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ దక్కించుకున్న కామారెడ్డి జిల్లాలోని ‘దోమకొండ కోట’ (Domakonda Fort) ప్రత్యేక విశిష్టత కలిగివున్న చారిత్రక ప్రదేశం. ఇది ప్రైవేటు నిర్మాణమే అయినప్పటికీ చారిత్రక, సాంస్కృతిక చరిత్రను కలిగివుంది.

Domakonda Fort: రామ్‌చరణ్-ఉపాసన పెళ్లి జరిగిన ఈ కోటకు అవార్డ్ ఎందుకొచ్చిందంటే..

యునెస్కో (UNESCO) ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ దక్కించుకున్న కామారెడ్డి జిల్లాలోని ‘దోమకొండ కోట’ (Domakonda Fort) ప్రత్యేక విశిష్టత కలిగివున్న చారిత్రక ప్రదేశం. ఇది ప్రైవేటు నిర్మాణమే అయినప్పటికీ చారిత్రక, సాంస్కృతిక చరిత్రను కలిగివుంది. యునెస్కో అవార్డ్‌తో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోట ప్రత్యేకతపై ఓ లుక్కేద్దాం...

ప్రస్తుత కామారెడ్డి జిల్లా దోమకొండ (Domakonda) మండల కేంద్రంలో ఉన్న ‘దోమకొండ కోట’ను (Domakonda Fort) 18వ శతాబ్దంలో కామినేని వంశస్థులు నిర్మించారు. సుమారు 39 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఈ నిర్మాణం ఉంది. ప్రాచీనకాలంలోనే ఈ కోటలో అద్భుతమైన భవనాలను నిర్మించారు. కోట లోపల ఉన్న భవనాల్లో దర్బార్‌ హాల్‌, నాట్యశాల, అంతఃపురం, అద్దాల మేడ ముఖ్యమైనవి. అందులో అద్దాల భవనం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మేడను 1922లో నిర్మించినట్లు శాసనం చెబుతోంది. ఈ కోటలో మహాదేవుని ఆలయం ఉంది. అప్పట్లో ఆలయానికి రాణి రుద్రమదేవి పూజలు చేసి వెళ్లినట్లు శాసనంలో ఉంది. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసమైన వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఈ కోటను నిర్మించినప్పుడు చుట్టూ ఏర్పాటు చేసిన కందకం ఇప్పటికీ కనిపిస్తుంది. కాగా నిత్యం పరిరక్షణ చర్యలు తీసుకుంటుండడం వల్ల ఈ కోట ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

నిజాం షాహీరాజులకు సామంతులు

దోమకొండ కోట ప్రాచీన సంస్థానాల్లో ఒకటిగా ఉంది. ఆ కాలంలో నిజాం షాహీరాజులకు కానిమేని వంశస్థులు సామంతులుగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నుంచి 20వ శాతబ్దం కామినేని వంశస్తులే ఈ కోటను పాలించారు. జమిందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు దోమకొండ పట్టణ కేంద్రంగా పాలన సాగించారు. దోమకొండతోపాటు భిక్కనూరు, సదాశివనగర్‌, రామారెడ్డి మండలాలు, మెదక్‌ జిల్లాలోని పలు గ్రామాలు వీరి ఆధీనంలో ఉండేవి. రామారెడ్డిలోని కాలభైరవ స్వామి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయాలు కూడా వీరి ఆధీనంలోనే ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. కామినేని వంశస్థుల పాలన సాగించిన చాలా గ్రామాలకు వీరి వారసుల పేర్లు ఉండడం విశేషం.

ప్రస్తుతం నిర్వహిస్తున్నది చిరంజీవి వియ్యంకుడే...

ప్రస్తుతం ఈ కోట నిర్వహణను దోమకొండ సంస్థానాధీశుడు, సినీనటుడు చిరంజీవికి వియ్యంకుడు కామినేని అనిల్‌కుమార్‌ చేపడుతున్నారు. కోటలోని ప్రతీ కట్టడాన్ని ప్రత్యేకంగా నిర్మించడం వల్ల కోటను కాపాడుకునేందుకు వారసులైన కామినేని వంశస్తులు ఆరేళ్లక్రితం కోటకు మరమ్మతు పనులు చేపట్టారు. కోట వైభవాన్ని కాపాడే చిహ్నాలు, చిత్ర శిల్పకళలు శిథిలావస్థకు చేరుకున్న సమయంలో నాడు నిర్మించిన విధంగానే ప్రస్తుతం కూడా అంతటి పరిజ్ఞానంతో మళ్లీ ఆ కట్టడాలకు జీవంపోశారు. అంతక్రితం ప్రముఖ సినీహీరో మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటను పర్యాటక స్థలంగా పునరుద్ధరించారు. యూపీఏ సర్కారు హయాంలో మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు దోమకొండ కోటను పర్యాటక స్థలంగా పునరుద్ధరించారు. దోమకొండ కోటకు యునెస్కో గుర్తింపురావడం పట్ల కామినేని అనిల్‌, ఆయన సతీమణి శోభన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆర్కిటెక్ట్‌ అనురాధ నాయక్‌ నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఈ కోటను పరిరక్షిస్తున్నారు.

రామ్‌చరణ్‌ - ఉపాసన పెళ్లితో ప్రాచుర్యం..

కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండల కేంద్రంలో ఉన్న గడికోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యాటక శోభను సంతరించుకోవడంతో దేశవ్యాప్త గుర్తింపు దక్కుతోంది. అయితే చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ మెగా హీరో రాంచరణ్‌ - ఉపాసన పెళ్లితో కోటకు ప్రాచుర్యం పెరిగింది. వారి వివాహ సమయంలో మీడియా మంచి కవరేజీ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు మెగాస్టార్‌ చిరంజీవితో పాటు మెగా హీరోలైన రాంచరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ పలు విందు -వినోదాల కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించారు. ఇటీవల చిరంజీవి జన్మదిన వేడుకలను కూడా మెగా కుటుంబ సభ్యులు రెండు రోజులపాటు ఇక్కడే జరిపారు. మరోవైపు.. ప్రతి శివరాత్రి సమయంలోనూ కోటలోని శివాలయంలో కామినేని వంశస్థులతో పాటు మెగా హీరో రాంచరణ్‌, ఉపాసన దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. స్థానిక దోమకొండ గ్రామస్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం శివరాత్రి సందర్భంగా కోటలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కాగా ప్రస్తుతం ఈ కోటను సందర్శించేందుకు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తున్నారు. దీంతో ఈ కోటకు క్రమంగా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.

Updated Date - 2022-11-28T17:52:34+05:30 IST