Indian Teenagers: ప్రాణాలు తీసిన ఈత సరదా.. యూకేలో నీటమునిగి ఇద్దరు భారత టీనేజర్లు మృతి
ABN , First Publish Date - 2022-08-31T15:36:03+05:30 IST
యూకే (UK)లో ఉండే ఇద్దరు భారత టీనేజర్లు ఉత్తర ఐర్లాండ్లోని ఒక సరస్సు (Lake)లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. మృతులు ఇద్దరు కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారే. మృతులను జోసెఫ్ సెబాస్టిన్(16), రూవెన్ సైమన్(16)గా గుర్తించారు. సోమవారం యూకేలో సెలవురోజు కావడంతో కొంతమంది..
లండన్: యూకే (UK)లో ఉండే ఇద్దరు భారత టీనేజర్లు ఉత్తర ఐర్లాండ్లోని ఒక సరస్సు (Lake)లో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. మృతులు ఇద్దరు కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారే. మృతులను జోసెఫ్ సెబాస్టిన్(16), రూవెన్ సైమన్(16)గా గుర్తించారు. సోమవారం యూకేలో సెలవురోజు కావడంతో కొంతమంది స్నేహితులతో కలిసి ఈ ఇద్దరు లండన్ డెర్రీలోని ఎనాగ్లాఫ్ (Enagh Lough)లో ఉన్న సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు సెబాస్టియన్, సైమన్ ఆ సరస్సులో గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత వారి మృతదేహాలు నీటిపై తేలాయి.
ఈ ఘటనపై ఉత్తర ఐరీష్ నగరం (Northern Irish city)లోని కేరళ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. ఈ విషాద ఘటన పట్ల స్థానిక కౌన్సిలర్ రాచెల్ ఫెర్గూసన్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తర ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ (Police Service in Northern Ireland) ఆ ఇద్దరు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఓ వ్యక్తిని సురక్షితంగా కాపాడామని, అతడు ప్రస్తుతం అక్కడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారి బోర్గాన్ (Brogan) తెలిపారు. కాగా, ఈ సంఘటనాస్థలిలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డెర్రీ/లండన్ డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, సాండ్రా డఫీ (Sandra Duffy) కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. డెర్రీ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించగలమని చెప్పుకొచ్చారు.