ఉన్నది ఉన్నట్టు చెప్పండి.. ట్విటర్ సీఈఓ Parag agarwal ముందు ట్విటర్ ఉద్యోగుల ఆక్రోశం..!
ABN , First Publish Date - 2022-05-01T03:20:37+05:30 IST
సోషల్ మీడియా సంస్థ ట్విటర్.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) సొంతమయ్యాక ట్విటర్ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎన్నారై డెస్క్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) ట్విటర్ను చేజిక్కించుకున్నాక సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థ భవిష్యత్తుతో పాటూ తమ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ట్విటర్ను లాభాల బాట పట్టించేందుకు ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తానంటూ బ్యాంకులకు మస్క్ హామీ ఇచ్చినట్టు వార్తలు వెలువడటమే ఇందుకు కారణం. బ్యాంకు రుణాల సాయంతోనే మస్క్ ట్విటర్ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటంటూ కొందరు నేరుగా సీఈఓ పరాగ్ అగర్వాల్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పండంటూ మరి కొందరు ఆవేశపడ్డారు. అయితే.. ఉద్యోగులకు ట్విటర్ యాజమాన్యం ఎంతో విలువ ఇస్తుందంటూ పరాగ్ అగర్వాల్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట. శుక్రవారం ట్విటర్ ఉద్యోగుల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.