Britain pm elections: తాజా సర్వేలో వెలుగులోకొచ్చిన ఆసక్తికర అంశం!
ABN , First Publish Date - 2022-08-03T03:24:26+05:30 IST
తాజాగా జరిగిన మరో సర్వేలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రిషి, లిజ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఈ సర్వే తేల్చింది.
లండన్: బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో లిజ్ ట్రస్(Lizz truss) విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఇటీవల ఓ సర్వే తేల్చేసింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్(Rishi sunak) రేసులో ఆమె కంటే చాలా వెనుకపడ్డారని పేర్కొంది. ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం కేవలం పది శాతమని లెక్కకట్టింది. దీంతో.. లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని అవుతారన్న అంచనాలు బలపడ్డాయి. అయితే..తాజాగా జరిగిన మరో సర్వేలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రిషి, లిజ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఈ సర్వే తేల్చింది. అధికారిక కన్సర్వేటివ్ పార్టీ(Conservative party) నేతల మద్దతు పరంగా ఇరువురి మధ్య వ్యత్యాసం స్వల్పంగానే ఉన్నట్టు సర్వేలో బయటపడింది. ఇటలీకి చెందిన డాటా కంపెనీ టెక్నే.. ఈ సర్వే జరిపించింది.
జులై 19 నుంచి 27 మధ్య జరిగిన సర్వేలో మొత్తం 807 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 48 శాతం మంది లిజ్ వెంట నిలువగా.. 43 శాతం మంది మాత్రం రిషికే తమ మద్దతు అని స్పష్టం చేశారు. దీంతో..ఇద్దరి మధ్య తేడా స్వల్పంగా ఉండటంతో తీవ్ర పోటీ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5న బ్రిటన్ ప్రధాని ఎవరో తెలిపోతుంది. సెప్టెంబర్ 2 సాయంత్రం ఐదు లోపు అధికార కన్సర్వేటివ్ పార్టీ నేతలు ప్రధానిని ఎన్నుకునేందుకు రిషి, లిజ్లలో ఎవరో ఒకరికి ఓటు వేయాల్సి ఉంటుంది. మెజారిటీ ఓట్లు వచ్చిన వారే ప్రధాని పీఠం చేపడతారు. ఈ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 5న వెల్లడవుతాయి.