కమలా హ్యారిస్ విషయమై బైడెన్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2022-01-20T17:10:16+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విషయమై తాజాగా కీలక ప్రకటన చేశారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విషయమై తాజాగా కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిసేనని బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం వైట్హౌస్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు అడిగిన పలు ప్రశ్నలకు బైడెన్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలి విషయమై కూడా అధ్యక్షుడికి విలేకర్లు ప్రశ్నలు సంధించారు. దీనిలో భాగంగా కమలా పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? అని అడిగారు. దీనికి బైడెన్ అవునని సమాధానమిచ్చారు. "ఆమె పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నాను. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నా తదుపరి ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆమెనే. అలాగే ఓటింగ్ హక్కుల విషయంలో ఆమెను నేనే ఇంఛార్జిగా నియమించాను. కమలా బాగా పనిచేస్తున్నారు" అని బైడెన్ చెప్పుకొచ్చారు. ఇక అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళా, నల్లజాతి, భారతీయ అమెరికన్గా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇండియన్ మదర్, జమైకన్ ఫాదర్కు అమెరికాలోని ఓక్లాండ్లో జన్మించిన కమలా హ్యారిస్ కాలిఫోర్నియాలో పెరిగారు. 2017లో తొలిసారి కాలిఫోర్నియా నుంచే సెనేటర్గాను ఎన్నికయ్యారు. దీంతో తొలి సౌత్ ఏసియన్-అమెరికన్, రెండో ఆఫ్రికన్-అమెరికన్ మహిళ సెనేటర్గా ఆమె చరిత్రకెక్కారు. ఆ తర్వాత పలు ముఖ్యమైన కమిటీలకు ప్రాతినిథ్యం వహించారామె. 2019 ఆగస్టులో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఆమెను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం 2020 నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, కమలా విజయం సాధించి దేశాధినేతలుగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.