NRI: సింగపూర్‌లో భారతీయ చిన్నారి సరికొత్త రికార్డు.. ఆరేళ్ల వయసులోనే..

ABN , First Publish Date - 2022-12-05T21:50:34+05:30 IST

సింగపూర్‌లోని భారత సంతతి చిన్నారి ఓం మదన్ గార్గ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

NRI:  సింగపూర్‌లో భారతీయ చిన్నారి సరికొత్త రికార్డు.. ఆరేళ్ల వయసులోనే..

ఎన్నారై డెస్క్: సింగపూర్‌లోని(Singapore) భారత సంతతి చిన్నారి ఓం మదన్ గార్గ్(Om Madan Garg) తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్‌కు చేరుకున్న అతి పిన్నవయస్కుడైన సింగపూర్‌ వాసిగా.. సింగపూర్ బూక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో(Singapore book of Records) చోటు దక్కించుకున్నాడు. తన తల్లిదండ్రులతో కలిసి గార్గ్.. 5,364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్ క్యాంప్‌కు(Base Camp) చేరుకుని అందరినీ అబ్బురపరిచాడు. ఇందుకోసం చిన్నారి ఏకంగా 65 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్(Trekking) చేశాడు. గార్గ్‌కు చిన్నప్పటి నుంచే ఇటువంటి సాహసయాత్రలు కొట్టినపిండిగా మారిపోయాయి. రెండున్నర ఏళ్ల వయసు నుంచే ఈ చిన్నారి.. తన తల్లిదండ్రుల వెంట వియత్నాం, థాయ్‌ల్యాండ్, లావోస్‌ దేశాల్లో సాహసయాత్రలు చేశాడు.

ఇక.. ఎవరెస్ట్ పర్వతారోహణ కార్యక్రమం మొత్తాన్ని గార్గ్ తల్లిదండ్రులు రికార్డు చేసి..ఓ సీరీస్ రూపంలో తమ ‘ది బ్రేవ్ టూరిస్ట్’ యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్ చేశారు. మదన్ గార్గ్ తండ్రి మయూర్ గార్గ్. ఆయన సీనియర్ బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గార్గ్ తల్లి పేరు గాయత్రీ మహేంద్రమ్, సెప్టెంబర్ 28న ఆ కుటుంబం తమ సాహస యాత్ర మొదలుపెట్టి కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేసింది. యూట్యూబ్‌లో ఇతర పర్వతారోహకులు పెట్టిన వీడియోలు చూసి వారు తమ యాత్రకు సిద్ధమయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు ట్రెయినింగ్ తీసుకున్నారు. ట్రెక్కింగ్ సందర్భంగా అలిసిపోయిన ప్రతిసారీ గార్గ్.. తనకిష్టమైన చాక్లెట్లు, టోఫీలు తిని మళ్లీ నూతనోత్సాహంతో ప్రయాణం కొనసాగించేవాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. అన్నట్టు గార్గ్.. అప్పుడే తన తరువాత లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నాడు. హిమాలయాల్లోని అమా డాబ్లామ్ పర్వతమే తన నెక్స్ట్ టార్గెట్ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-12-05T21:56:53+05:30 IST