Dubai Duty Free raffle: భారతీయుడిని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.7.9కోట్లు!

ABN , First Publish Date - 2022-08-04T14:04:54+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఇక లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు.

Dubai Duty Free raffle: భారతీయుడిని వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.7.9కోట్లు!

దుబాయ్: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఇక లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపర్‌ ఆఫర్‌ అనేది కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. ఆ అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు. క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఇలా జీవితంలో ఒక్కసారి లాటరీ తగిలితే చాలు అనుకునే వారు కోకొలల్లలు. ఇక అలాంటి వారికి అదృష్ట దేవత వరిస్తే.. నిన్నటివరకు సాదాసీదా జీవితం గడిపినవారు రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా మారిపోతారు. అలాంటి అదృష్టమే తాజాగా దుబాయ్‌లో ఉండే ఓ భారత వ్యక్తికి వరించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో (Dubai Duty Free Millennium Millionaire draw) కోశి వర్గీస్ (48) అనే భారత ప్రవాసుడు ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.7.9కోట్లు) గెలుచుకున్నాడు. 


బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో (Dubai International Airport) నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ (Dubai Duty Free) డ్రాలో కోశి విజేతగా నిలిచాడు. కొన్ని వారాల క్రితం అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ నం.396, లాటరీ టికెట్ నం.0844కు ఈ జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోశి బ్యాంక్ ఖాతాలోకి రూ.7.9కోట్లు వచ్చిపడ్డాయి. దుబాయ్‌లో నివాసముండే 48 ఏళ్ల కోశి చాలా కాలంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల స్వస్థలం కొచ్చిన్ నుంచి దుబాయ్ వస్తున్న సమయంలో ఇలాగే లాటరీ టికెట్ కొన్నాడు. అదే లాటరీ టికెట్ కోశికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.  


"నేను కొన్ని సంవత్సరాలుగా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. చివరకు నాకు అదృష్టం వరించింది. ఇంత భారీ మొత్తం గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఇది జరిగేలా చేసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టీమ్‌ని చూడటానికి ఎదురు చూస్తున్నాను" అని కోశి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు అతడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ జాతీయులలో వర్గీస్ 195వ వ్యక్తి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ టిక్కెట్ కొనుగోలుదారులలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉంటున్నారని ఈ సందర్భంగా రాఫెల్ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-08-04T14:04:54+05:30 IST