Kuwait: ముగ్గురు కువైటీల హత్య కేసు.. భారతీయుడి అరెస్ట్!

ABN , First Publish Date - 2022-03-06T16:27:08+05:30 IST

ఈ నెల 4న కువైత్‌లోని ఆర్దియాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారి నివాసంలోనే అనుమానస్పదస్థితిలో మృతిచెందడం కలకలం సృష్టించింది.

Kuwait: ముగ్గురు కువైటీల హత్య కేసు.. భారతీయుడి అరెస్ట్!

కువైత్ సిటీ: ఈ నెల 4న కువైత్‌లోని ఆర్దియాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారి నివాసంలోనే అనుమానస్పదస్థితిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. వారి శరీరంపై కత్తితో పొడిచిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. 80 ఏళ్ల వ్యక్తితో పాటు అతని భార్య(50), కూతురు(18) వారి ఇంట్లో వేర్వేరు చోట్ల విగతజీవులుగా పడి ఉన్నారు. అప్పటికే వారు చనిపోయి నాలుగు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడం వల్ల ఈ ఘటన బయటకు వచ్చింది. దీంతో ఈ కేసును సవాళ్లుగా తీసుకున్న కువైత్ పోలీసులు.. అక్కడి డిటెక్టివ్స్ సహాయంతో కేవలం 48 గంటల్లోనే హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. 


ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా కీలక ఆధారాలు లభించాయి. మృతుల ఇంట్లోకి ఓ వ్యక్తి అనుమానస్పదంగా ప్రవేశించడం అక్కడి కెమెరాల్లో రికార్డైంది. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు సులైబియా ప్రాంతంలో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసుల విచారణలో ఆ ముగ్గురిని తానే హత్య చేసినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు. కాగా, హంతకుడు భారత్‌కు చెందిన వ్యక్తి అని, ఆ కుటుంబ యజమానితో ఆర్థిక వివాదం కారణంగా వారిని చంపినట్లు ఒప్పుకున్నట్లు కువైత్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే, అరెస్టైన భారతీయుడి వివరాలను మాత్రం వెల్లడించలేదు.        

Updated Date - 2022-03-06T16:27:08+05:30 IST