Etihad Airways: విద్యార్థులకు షాక్.. చావు కబురు చల్లగా చెప్పిన ఎతిహాద్ ఎయిర్వేస్!
ABN , First Publish Date - 2022-08-05T23:38:25+05:30 IST
అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు త్వరలో సెమిస్టర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్లడానికి సిద్ధం అయ్యరు. ప్రయాణం ఆర్థికంగా భారం కాకుడదనే ఉద్దేశం
ఎన్నారై డెస్క్: అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల(Indian Students)కు త్వరలో సెమిస్టర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళ్లడానికి సిద్ధం అయ్యరు. ప్రయాణం ఆర్థికంగా భారం కాకుడదనే ఉద్దేశంతో చాలా రోజుల ముందే విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆగస్ట్ 4న బెంగళూరు, ముంబై విద్యార్థులు ఎయిర్పోర్ట్కు బయల్దేరారు. ఇంతలో ఎతిహాద్ ఎయిర్వేస్(Etihad Airways).. విద్యార్థులకు షాక్ ఇచ్చింది. టికెట్లను రద్దు(cancels flight tickets) చేసినట్టు మెయిల్ పంపి.. చావు కబురు చల్లగా చెప్పింది.
ఈ సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘బోర్డింగ్ సమయం 2.40 గంటలకు ఉండటంతో తల్లిదండ్రులతో కలిసి ఎయిర్ పోర్టుకు బయల్దేరా. మార్గ మధ్యంలో ఎతిహాద్ నుంచి నాకో మెయిల్ వచ్చింది. నా టికెట్ను రద్దు చేసినట్టు మెయిల్ వచ్చింది. అంతేకాదు.. ఎతిహాద్కు చెందిన మరో విమానంలో ప్రయాణించే అవకాశం కూడా కల్పించలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. ‘ ఆగస్టు 4న యూఎస్ వెళ్లడానికి రూ.94వేలతో జూన్లో టికెట్ బుక్ చేసుకున్నా. కానీ.. ఎతిహాద్ నా టికెట్ను కూడా రద్దు చేసింది. దీంతో ఆగస్టు 10న ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ విమానంలో అమెరికా వెళ్లడానికి రూ.2.19లక్షలు ఖర్చు చేసి మరో టికెట్ను బుక్ చేసుకోవాల్సి వచ్చింది. నేను టికెట్ కోసం సెర్చ్ చేసినప్పుడు కొన్ని ఎయిర్లైన్స్కు చెందిన టికెట్ ధరలు ఇంకా చాలా ఎక్కువ ఉండటాన్ని గమనించాను. ఎతిహాద్ నా టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తానని చెప్పింది. కానీ ఆ డబ్బులు నా అకౌంట్లోకి జమ కావడానికి సుమారు 7-45 రోజుల సమయం పడుతుంది’ అని పేర్కొన్నాడు. కాగా.. విద్యార్థుల టికెట్లు అనూహ్యంగా రద్దు కావడానికి గల కారణాలను ఎతిహాద్ ప్రతినిధులు వెల్లడించారు. పేలోడ్ ఆంక్షల కారణంగా ప్రయాణికుల టికెట్లను రద్దు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.