Americaకు నో.. Canada వైపే భారతీయుల చూపు!

ABN , First Publish Date - 2022-03-08T00:14:42+05:30 IST

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని.. తర్వాత మంచి జాబ్ సంపాదించి అక్కడే స్థిరపడేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అదంతా గతం. ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికాలో చదివేందుకు భారత విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. యూఎస్ పొరుగు దేశమైన కెనడాలో..

Americaకు నో.. Canada వైపే భారతీయుల చూపు!

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని.. తర్వాత మంచి జాబ్ సంపాదించి అక్కడే స్థిరపడేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అదంతా గతం. ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికాలో చదివేందుకు భారత విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. యూఎస్ పొరుగు దేశమైన కెనడాలో ఉన్నత చదువులు చదివేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) వెల్లడించింది. 



ఎన్ఎఫ్ఏసీ తాజా రీసెర్చ్ ప్రకారం 2016-19 మధ్య మాస్టర్స్, ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌ల కోసం అమెరికాను ఎంపిక చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 40శాతం పడిపోయింది. ఇదే సమయంలో కెనడాలోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఏకంగా 182శాతం పెరిగింది. కరోన విజృంభణకు ముందు 2016-17, 2019-20 విద్యా సంవత్సరాల్లో అమెరికా యూనివర్సిటీల్లో నమోదు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 7.2శాతం తగ్గిపోయింది. అదేవిధంగా కెనడాలో నమోదు చేసుకున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య  52% పెరిగింది. 2016-17, 2020-21 విద్యా సంవత్సరాల మధ్య మాస్టర్ లెవల్ సైన్స్, ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌‌ల కోసం అమెరికా యూనివర్సిటీల్లో నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 56శాతం (47,230 మంది) తగ్గింది. కెనడాలో అమలు చేస్తున్న విధానాల వల్లే అంతర్జాతీయ విద్యార్థులతోపాటు భారతీయ విద్యార్థులు కూడా ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఎన్ఎఫ్‌ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట్ అండర్సన్ తెలిపారు. అమెరికాతో పోల్చితే కెనడాలోనే  అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగ, పర్మినెంట్ రెసిడెన్స్ హోదా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలను మెరుగు పరిచే వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని చెప్పారు. 


ఇదిలా ఉంటే.. పెద్ద మొత్తంలో న్యూ ప‌ర్మినెంట్ రెసిడెంట్స్ సంఖ్య పెంచ‌డానికి ఇమ్మిగ్రేష‌న్ ప్రోగ్రామ్‌ను కెన‌డా ప్ర‌భుత్వం విస్త‌రిస్తున్న‌ది. ఇందులో భాగంగా కెన‌డా ప్ర‌భుత్వం ఇమ్మిగ్రేష‌న్ ప్లాన్లు సిద్ధం చేసింది. 2022లో 4,31,645 మంది, 2023లో 4,47,055 మంది, 2024లో 4.51 ల‌క్ష‌ల మందికి శాశ్వ‌త రెసిడెన్స్ హోదా క‌ల్పించాల‌ని నిర్ణయం తీసుకుంది. 




Updated Date - 2022-03-08T00:14:42+05:30 IST