వైభవంగా డా. లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-04T18:49:47+05:30 IST

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 1న (శనివారం) డా. లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

వైభవంగా డా. లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు

కాలిఫోర్నియా: సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ నెల 1న (శనివారం) డా. లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ డా. టీవీ నాగేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. హనిమిరెడ్డి చేస్తున్న ప్రజోపకరమైన కార్యక్రమాలు, వారి వితరణ  ప్రవాస భారతీయులందరికీ ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ఒక భారతీయుడిగానే కాకుండా సాటి తెలుగువాడిగా కూడా తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.


ఉదయం సిలికానాంధ్ర కార్యవర్గం డా. హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను వారి విడిది నించి గుఱ్ఱపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి వేడుకగా తీసుకువచ్చారు. అక్కడ నుంచి పల్లకీలో పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా భవనంలోకి తీసుకువచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి డా. కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ చమర్తి రాజు వారిని సాదరంగా భవనంలోకి ఆహ్వానించారు. 


డా. హనిమిరెడ్డి గారి విగ్రహాన్నీ, లోహ ఫలకాన్ని భారత కాన్సులేట్ జనరల్ డా. టీవీ నాగేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. సరిగ్గా 6 సంవత్సారాల క్రితం ఇదే రోజున విశ్వవిద్యాలయ భవనం గృహప్రవేశం జరిగిందని గుర్తు చేశారు. అది కూడా డా. హనిమిరెడ్డి దాతృత్వం వల్లనే ఆ రోజున ఈ భవనం కొనుగోలు సాధ్యపడిందని సభికులకు తెలిపారు. 


తొలుత సభ వేదపండితుల వేదాశీర్వచనాలతో ప్రారంభమయ్యింది. లివర్ మోర్‌లోని శివ విష్ణు దేవాలయ ప్రధాన అర్చకస్వామి, మిల్ పిటాస్‌లోని సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు తమ, తమ దేవాలయాలకు డా. హనిమిరెడ్డి కుటుంబం చేసిన సేవలను వివరించారు. ఆ తరువాత కుమారి తనుగుల ఈష ప్రార్ధన గీతం పాడగా, కుమారి అయ్యగారి అనఘ వయోలిన్ వాయిద్య కచేరితో అలరించింది. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు మాధవపెద్ది మూర్తి చేసిన నృత్యం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. 


సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం డా.హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను వేదిక మీదకు ఆహ్వానించారు. వారికి ఘనసన్మానం చేసి, డా.హనిమిరెడ్డికి “సిలికానాంధ్ర శ్రీకర” అనే బిరుదు ప్రదానం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేకంగా చేయించిన కేక్‌ను కట్ చేయించారు. కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన కాంగ్రెస్ రో ఖన్నా, కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా, కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ సభ్యుడు డేవ్ కార్టజ్‌లు వారికి తమ కార్యాలయాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వారి దాతృత్వానికి ప్రశంసాపత్రాలు పంపారు. 


అలాగే సభకు హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డా. రఘునాథ్ రెడ్డి, కిరణ్ ప్రభ, కొండిపర్తి దిలీప్ ప్రభృతులు వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేశారు. డా.హనిమిరెడ్డి నుంచి ముఖ్యంగా అందరూ నేర్చుకోవాల్సింది సమాజం పట్ల బాధ్యత, వితరణశీలత అని అన్నారు. డా.హనిమిరెడ్డికి మరెందరో పుర ప్రముఖులు స్వయంగా, సందేశాలు పంపి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సిలికానాంధ్ర కార్యకర్తలు వారి కుటుంబసభ్యుల సహకారంతో సేకరించిన చిత్రాలతో, వీడియోలతో డా. హనిమిరెడ్డి 80 ఏళ్ళ జీవనయానంలో ముఖ్య మైలురాళ్ళను చూపిస్తూ ప్రదర్శించిన ఏవీ (AV) సభికులను అలరించింది.


డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ... తనకు చెప్పడానికి మాటలు రావట్లేదని, అందరూ తనపై చూపిన ప్రేమ, అభిమానం తానెప్పటికీ మరిచిపోలేనని అన్నారు. చదువు అన్న మూడక్షరాలే ఎక్కడో భారతదేశంలోని ఒక పల్లెటూరులో పుట్టిన తనను ఇంతగా ఎదిగే అవకాశం కల్పించిందని తెలిపారు. ఆ చదువు అందరికీ అందుబాటులోకి తేవడానికే తాను ఎన్నో విద్యాసంస్థలకు దానధర్మాలు చేస్తూ తనవంతు సహాయం అందిస్తున్నానని సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు.  




ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యకర్తలు కందుల సాయి, కోట్ని శ్రీరాం, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరిలకు డా.హనిమిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సభానంతరం అతిధులకు విందు భోజనం అందించారు.

Updated Date - 2022-10-04T18:49:47+05:30 IST