NRI: మరో కాంట్రవర్సిలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్! అసలే ప్రజలు కష్టాల్లో ఉంటే..

ABN , First Publish Date - 2022-11-27T19:22:40+05:30 IST

భారత్ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు.

NRI: మరో కాంట్రవర్సిలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్! అసలే ప్రజలు కష్టాల్లో ఉంటే..

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. పెరుగుతున్న జీవనవ్యయాలు ప్రజలు నడ్డి విరుస్తుంటే..ప్రభుత్వం దుబారా ఖర్చులకు దిగుతోందంటూ ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలోగల ఉద్యానవనంలో అలంకరణ కోసం ఓ ఖరీదైన విగ్రహాన్ని వేలంలో ప్రభుత్వం కొనడమే ఈ వివాదానికి నాంది పలికింది. స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని ప్రతిబింబించేలా కంచుతో తయారు చేసిన ఓ మహిళ విగ్రహం(Sculpture) అది. హెన్రీ మూర్(Henry Moore) అనే ప్రసిద్ధ బ్రిటన్ శిల్పి 1980ల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రముఖ ఆక్షన్ సంస్థ క్రిస్టీ నిర్వహించిన ఓ వేలంలో ప్రభుత్వం 1.3 మిలియన్ పౌండ్ల(సుమారు రూ.12 కోట్లు) ప్రజాధానం వెచ్చించి ఈ విగ్రహాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

‘‘అసలే బ్రిటన్ ప్రజలు జీవనవ్యయాల భారంతో కుంగిపోతున్నారు. ఇలాంటి టైంలో ఇంత మొత్తాన్ని వెచ్చించడం దుబారా కర్చే’’ అని విగ్రహాల తయారీ నిపుణులు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వద్ద ఇటువంటి విగ్రహాలు సుమారు 14 వేల వరకూ ఉన్నట్టు సమాచారం. బ్రిటన్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటన్ ప్రభుత్వ భవనాల్లో వీటిని ఏర్పాటు చేశారు. కాగా.. 20వ శతాబ్దపు ప్రముఖ బ్రిటన్ శిల్పుల్లో హెన్నీ మూర్ అగ్రగణ్యుడిగా పేరు పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. కంచుతో ఆయన రూపొందించిన విగ్రహాలు గొప్ప కళాఖండాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. భారత్‌లో కూడా హెన్రీ రూపొందించిన కళాఖండాలను ఉన్నాయి.

Updated Date - 2022-11-27T19:24:31+05:30 IST