Boston Mahanadu: ఘనంగా బోస్టన్ మహానాడు.. NRI లలో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం
ABN , First Publish Date - 2022-05-22T14:29:13+05:30 IST
ఆద్యంతం నాయకుల ఆనందోత్సాహాల మధ్య బోస్టన్ మహానాడులో కార్యక్రమాలు నిర్వహించారు. `ఎన్టీఆర్ అన్న` ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు.

ఆద్యంతం నాయకుల ఆనందోత్సాహాల మధ్య బోస్టన్ మహానాడులో కార్యక్రమాలు నిర్వహించారు. `ఎన్టీఆర్ అన్న` ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. తొలుత కార్యక్రమాన్ని బోస్టన్ మహానాడు కన్వేయర్ కాళిదాస్ సూపరనేని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. `మా తెలుగు తల్లికి మల్లెపూదండ` గీతాన్ని ఆలపించారు. అనంతరం ఇటీవల కాలంలో మృతి చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాప సూచకంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అనంతరం ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రారంభ ప్రసంగం చేశారు.
జగన్ పాలనలో రాష్ట్రానికి ఎన్నడూ జరగనంత నష్టం: బోస్టన్ మహానాడులో చంద్రబాబు
ఈ వేడుకకు స్వాగతోపన్యాసం చేసిన అధినేత చంద్రబాబు నాయుడు తన సందేశాన్ని అందించి, అక్కడి ప్రవాస ఆంధ్రుల్లో కొత్త ఉత్సాహం నింపారు. నాలెడ్జ్ను, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. రాష్ట్రం అధోగతి పాలయిన వైనాన్ని వివరిస్తూనే ఇటీవల తాను చేపట్టిన జిల్లాల పర్యటన(ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం మొదలుకుని కడప వరకూ) ఏ విధంగా సాగిందన్నది వివరించారు. ప్రజల్లో వచ్చిన మార్పు, వారిలో వెల్లువెత్తిన చైతన్యం అన్నవి తనను ఆలోచింపజేశాయని పేర్కొన్నారు. అదేవిధంగా తాము చేపట్టిన నిరసన కార్యక్రమాలకు కూడా మంచి స్పందన వస్తుందని తెలిపారు. 'బాదుడే బాదుడు' పేరిట నిర్వహించిన కార్యక్రమాన్ని విశేష ఆదరణ వచ్చిందని, ప్రజలు ఇప్పుడిప్పుడే పాలన సంబంధిత వైఫల్యాలను గుర్తించి తిరుగుబాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం పార్టీని పునరుత్తేజం చేయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ సాగింది. బోస్టన్లో ఉన్న కార్యకర్తలు కూడా తామంతా TDP ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. అటుపై జూమ్ ద్వారానే చింతమనేని ప్రభాకర్తో సహా పలువురు ముఖ్య నేతలు మాట్లాడి కొత్త చైతన్యం తీసుకు వచ్చారు. గతం కన్నా భిన్నంగా ఈసారి మహానాడు అమెరికా వాకిట సాగింది. ప్రవాసాంధ్రులంతా ఓ చోట చేరి మళ్లీ తాము పార్టీ గెలుపునకు కృషి చేస్తామని అధినేతకు మాట ఇవ్వడం ఈ వేడుకలో ఓ కొసమెరుపు.

2024లో మళ్లీ TDP అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పునర్నిర్మాణం జరపాల్సి ఉందని నొక్కి చెప్పారు. తెలుగు దేశం అధికారంలోకి రావాలని ప్రజలు ఏకపక్షంగా కోరుకుంటున్నారని అన్నారు. 2,200 మందితో బోస్టన్లో మహానాడు నిర్వహించడం.. పార్టీకి, తెలుగు వారికి కూడా గర్వకారణమని చంద్రబాబు అభినందించారు. తెలుగు దేశం ఆవిర్భావం తరువాతనే తెలుగు ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ రోజు లక్షల మంది ఉన్నత చదువులతో ఐటీ రంగంలో స్థిరపడడానికి నాడు తెలుగు దేశం ప్రభుత్వ తీసుకున్న పాలసీలే కారణం అని తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజల వెతలు, వ్యవస్థల విధ్వంసంపై NRI లతో చంద్రబాబు మాట్లాడారు. జగన్ పాలనతో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు.

పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను జగన్ ఎలా ధ్వంసం చేశారో ప్రజలు చూశారని అన్నారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్. కృష్ణయ్య లాంటి వారికి తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ టికెట్లు ఇచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తాను ప్రకటించినట్లు వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని చంద్రబాబు మరో సారి హామీ ఇచ్చారు. 2024లో TDP ని అధికారంలోకి తీసుకురావడంలో NRI లు తమ వంతు పాత్ర పోషించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 7 తీర్మానాలను సభ ఆమోదించింది. తర్వాత పలువురు వక్తలు ప్రసంగించారు. యువతను ఆకర్షించడం, సీనియర్ నేతలకు మద్దతుగా ఉండడం, సోషల్ మీడియాలో మరింత పుంజుకోవడం, ఏపీలోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి వచ్చిన సీనియర్నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఎంవీఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి(తెలంగాణ), మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు మన్నవ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు.

జూమ్ ద్వారా పాల్గొన్నవారిలో టైగర్ చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. యువతకు ఈ కార్యక్రమంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఇటీవల కాలంలో పార్టీలో వచ్చిన మార్పులు.. యువత భావనలు.. వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా పలువురు మహిళా నాయకులు పార్టీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం.. భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరు.. ప్రణాళికలపై మాట్లాడారు. అనంతరం ప్రస్తుత ఏపీ సర్కారు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీనియర్ నాయకులు చర్చించారు. బోస్టన్ మహానాడులో 'పంచ్ జుగల్బందీ' అనే వెరైటీ పోటీ నిర్వహించారు. దీనిలో సీనియర్ నేతలు పాల్గొన్నారు.