భారత సంతతి వ్యక్తికి ఉరి.. నిరసనగా ఎంబసీ ముందు కొవ్వొత్తుల ప్రదర్శన
ABN , First Publish Date - 2022-04-28T14:11:41+05:30 IST
డ్రగ్ కేసులో పట్టుబడి పదేళ్లు జైలు జీవితం గడిపిన భారత సంతతి వ్యక్తి మలేసియాకు చెందిన నాగేంద్రన్ ధర్మలింగం(34)ను సింగపూర్ అధికారులు బుధవారం ఉరితీసిన విషయం తెలిసిందే.
కౌలాలంపూర్: డ్రగ్ కేసులో పట్టుబడి పదేళ్లు జైలు జీవితం గడిపిన భారత సంతతి వ్యక్తి మలేసియాకు చెందిన నాగేంద్రన్ ధర్మలింగం(34)ను సింగపూర్ అధికారులు బుధవారం ఉరితీసిన విషయం తెలిసిందే. ధర్మలింగం ఉరితీతకు నిరసనగా మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న సింగపూర్ ఎంబసీ ముందు ప్రవాసులు, మానవహక్కుల కార్యకర్తలు బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కాగా, నాగేంద్రన్ ఉరిశిక్ష అమలును మొదటి నుంచి పలువురు ప్రముఖులు, సంస్థలు వ్యతిరేకించాయి. మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు సమాచారం- అతడి ఐక్యూ లెవల్ కేవలం 69 మాత్రమే) నాగేంద్రన్కు మరణశిక్ష అమలు సరికాదని విమర్శించాయి. యురోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే నాగేంద్రన్కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు అప్పీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, సింగపూర్ న్యాయస్థానం మాత్రం ఆ అప్పీల్ను గత బుధవారం(ఏప్రిల్ 20) కొట్టేసింది. అంతేగాక వారం రోజుల తర్వాత అంటే తర్వాతి బుధవారం(ఏప్రిల్ 27) ఉరిశిక్షను అమలు చేయాలని ఆదేశించింది. దీంతో నిన్న ధర్మలింగంను ఉరితీశారు. ఇక అతడి ఉరికి నిరసనగా ప్రవాసులు, మానవ హక్కుల కార్యకర్తలు కౌలాలంపూర్లోని సింగపూర్ ఎంబసీ ముందు బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సింగపూర్ నార్కోటిక్ కఠిన చట్టాలను తీవ్రంగా ఖండించారు. "మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు మరణశిక్షను అమలు చేయడం అనేది అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి విరుద్ధంగా ఉంది" అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం హై కమీషనర్ అన్నారు. సింగపూర్లో మరణశిక్షల అమలు పెరిగిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.