బ్రిటన్ పౌరుడికి భారత్లో కరోనా పాజిటివ్! ఇదంతా స్కామ్.. డబ్బు గుంజేందుకే అంటూ.. తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - 2022-01-04T00:20:16+05:30 IST
భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు ముంబైలో ఎయిర్పోర్టులో అనుసరిస్తున్న విధి విధానాలపై మండిపడ్డారు. ఇదంతా స్కామ్... మా నుంచి డబ్బులు గుంజేందుకే ఇదంతా.. అంటూ అగ్గిమీద గుగ్గిలమైన ఆయన ఫేస్బుక్లో ఓ వీడియో పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు ముంబైలో ఎయిర్పోర్టులో అనుసరిస్తున్న విధి విధానాలపై మండిపడ్డారు. ‘‘ఇదో స్కామ్... మా నుంచి డబ్బులు గుంజేందుకే ఇదంతా..’’ అంటూ అగ్గిమీద గుగ్గిలమైన ఆయన ఫేస్బుక్లో ఓ వీడియో పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో పేర్కొన్న దాని ప్రకారం.. మనోజ్ లడ్వా తన మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు డిసెంబర్ 30న వర్జిన్ విమానంలో లండన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు ఆయనకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో.. మనోజ్, ఆయన భార్యను అధికారులు క్వారంటైన్కు తరలించారు.
అయితే..తాము విమానం ఎక్కేముందు కూడా కరోనా టెస్టు చేయించుకోగా..నెగెటివ్ వచ్చిందని చెప్పిన ఆయన.. కేవలం మూడు గంటల్లో ఫలితం పాజిటివ్గా ఎలా వస్తుందని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఫలితాన్ని నిర్ధారించుకునేందుకు మరోసారి కరోనా టెస్టు చేయించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తనతోపాటు ఎక్కిన అనేక మంది ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో కరోనా రోగులను విమానం ఎక్కేందుకు వర్జిన్ ఎయిర్లైన్స్ అనుమతించింది అంటూ సెటైర్లు వేశారు. ‘‘క్వారంటైన్ సెంటర్లో సంప్రదించేందుకు సరైన వ్యక్తులు ఎవరూ లేరు. ఇదంతా స్కామ్..’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై ఎయిర్పోర్టు వెబ్ సైట్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం..సాధారణ కరోనా టెస్టు ఖరీదు రూ. 500. ఇక మరింత కచ్చితమైన ఫలితాలను ఇచ్చే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఖరీదు రూ. 1975. ఈ పరిక్ష నిర్వహించిన 1-2 గంటల్లో రిపోర్టులు వస్తాయి.