Sikh migrants: అమెరికా సరిహద్దు వద్ద సిక్కు శరణార్థుల హక్కుల ఉల్లంఘన.. దర్యాప్తు ప్రారంభించామన్న అగ్రరాజ్యం

ABN , First Publish Date - 2022-08-05T02:36:52+05:30 IST

అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వెళుతున్న 50 మంది సిక్కు శరణార్థుల తలపాగాలను.. అధికారులు బలవంతంగా తీసుకున్నారన్న ఆరోపణలపై అగ్రరాజ్యం దర్యాప్తు ప్రారంభించింది.

Sikh migrants: అమెరికా సరిహద్దు వద్ద సిక్కు శరణార్థుల హక్కుల ఉల్లంఘన.. దర్యాప్తు ప్రారంభించామన్న అగ్రరాజ్యం

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వెళుతున్న 50 మంది సిక్కు శరణార్థుల(sikh asylees) తలపాగాలను.. అధికారులు బలవంతంగా తీసుకున్నారన్న ఆరోపణలపై అగ్రరాజ్యం దర్యాప్తు ప్రారంభించింది. సిక్కుల మతపరమైన హక్కుల(Religious rights) ఉల్లంఘన జరిగిందంటూ మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టి సారించింది. మీడియా కథనాల ప్రకారం..  మెక్సికో-అమెరికా సరిహద్దు వద్ద ఇటీవల అమెరికా సరిహద్దు గస్తీ దళాలు సిక్కు శరణార్థులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా వారి తలపాగాలను అధికారులు జప్తు చేసినట్టు తెలిసింది. ‘‘ఇటువంటి ఆరోపణలను మేం సీరియస్‌గా తీసుకుంటాం’’.. అని అమెరికా కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీసీ) కమిషనర్ క్రిస్ మాగ్నస్ బుధవారం మీడియాకు తెలిపారు. జూన్‌లో తొలిసారి ఈ ఆరోపణలు తెరపైకి వచ్చిన వెంటనే తమ సంస్థ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందన్నారు. ‘‘శరణార్థులతో మర్యాదగా, మానవత్వంతో వ్యవహరించాలన్నదే మా విధానం. ఇక ఈ ఆరోపణల్లో నిజానిజాలను వెలికితీసేందుకు దర్యాప్తు ప్రారంభించాం’’ అని చెప్పారు. 


అంతకుమునుపు.. మానవహక్కుల సంస్థ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్‌యూ).. శరణార్థుల మతపరమైన హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ సీబీసీ కమిషనర్‌కు ఓ లేఖ రాసింది. భద్రతా సిబ్బంది ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ‘‘యూమా బార్డర్ పాట్రోల్ సెక్టర్‌లో 50మంది శరణార్థుల తలపాగాలను అధికారులు తీసుకుని.. మళ్లీ తిరిగివ్వలేదన్న విషయాన్ని మీ దృష్టికి తేదలిచాం.’’ అని ఏసీఎల్‌యూ లేఖలో రాసింది. అయితే, సిక్కు శరణార్థులు.. ఏయే దేశాలకు చెందిన వారనేది మాత్రం వెల్లడించలేదు. సిక్కు టర్బన్(తలపాగా) వల్ల కలిగే భద్రతాపరమైన సమస్యలేంటో కూడా అధికారులు వివరించలేకపోయారని ఏసీఎల్‌యూ తరపు లాయర్ మీడియాకు తెలిపారు. ఎటువంటి వివరణ లేకుండా శరణార్థుల వస్తువులను అధికారులు తీసేసుకుంటున్నారని ఆరోపించారు. తాజా ఘటన కూడా ఇందులో భాగమేనని చెప్పారు.

Updated Date - 2022-08-05T02:36:52+05:30 IST