Indian Techies trapped in Myawaddy: ఐటీ ఉద్యోగాల కోసం వెళ్లి.. మయన్మార్లో చిక్కుకున్న 60 మంది భారతీయ టెకీలు!
ABN , First Publish Date - 2022-09-15T13:43:16+05:30 IST
ఐటీ ఉద్యోగాల కోసం థాయ్లాండ్ వెళ్లే క్రమంలో మయన్మార్లో (Myanmar) చిక్కుకుపోయిన 60 మంది భారతీయ టెకీలలో (Indian Techies) 30 మందిని అక్కడి భారత ఎంబసీ అధికారులు కాపాడారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐటీ ఉద్యోగాల కోసం థాయ్లాండ్ వెళ్లే క్రమంలో మయన్మార్లో (Myanmar) చిక్కుకుపోయిన 60 మంది భారతీయ టెకీలలో (Indian Techies) 30 మందిని అక్కడి భారత ఎంబసీ అధికారులు కాపాడారు. మిగిలిన 30 మందిని కూడా రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం (Indian embassy) చర్యలు చేపట్టింది. వీరంతా థాయ్లాండ్ (Thailand) సరిహద్దులోని పూర్తిగా ప్రభుత్వ అదుపులోలేని మైవడ్డీ (Myawaddy) అనే ప్రాంతంలో చిక్కుకున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా పలు సాయుధ తిరుగుబాటు వర్గాల చేతిలో ఉంటుంది. అంతేగాక డిజిటల్ కుంభకోణాలకు ఇది కేంద్రం అని తెలుస్తోంది. కొన్ని బోగస్ ఐటీ సంస్థలు ఇక్కడ నుంచి నకిలీ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, డిజిటల్ కుంభకోణాలు నడుపుతుంటాయి. వాటి ఏజెంట్లు భారతీయులకు థాయ్లాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సరైన ధృవపత్రాలు లేకుండానే మైవడ్డీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వదిలేస్తున్నారట.
"మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 60 మందికి పైగా భారతీయ పౌరులను మోసగాళ్లు మోసగించారు. వారు మైవడ్డీ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రాంతం పూర్తిగా మయన్మార్ ప్రభుత్వ నియంత్రణలో లేదు" అని భారత ఎంబసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. యాంగాన్లోని భారత రాయబార కార్యాలయం (Indian embassy) వారి రక్షణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
"ఈ ప్రాంతం పూర్తిగా స్థానిక అధికారుల నియంత్రణలో లేనందున, వ్యాపార సంఘంలో వివిధ పరిచయాల ద్వారా భారతీయ పౌరులను రక్షించడానికి ఇతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మైవడ్డీ ప్రాంతంలో చిక్కుకున్న 30 మందికి పైగా భారతీయ పౌరులను రాయబార కార్యాలయం రక్షించింది. మిగిలిన వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి ఎంబసీ అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తోంది" అని ఆయన చెప్పారు.