Village singers: పల్లెపాటలకు జీవం పోస్తున్న ‘మట్టిలో మాణిక్యాలు’..

ABN , First Publish Date - 2022-12-01T19:31:44+05:30 IST

పచ్చదనం అల్లుకున్న పల్లెతల్లి ఒడిలో పుట్టిపెరిగారు... సొంత ఊరి జనం, అమ్మానాన్నల కమ్మని రాగాలు వింటూ ఎదిగారు... ఆ రాగాలనే అవపోషణ పట్టి ఇప్పుడు అందరినీ మెప్పిస్తున్నారు.

Village singers: పల్లెపాటలకు జీవం పోస్తున్న ‘మట్టిలో మాణిక్యాలు’..

పచ్చదనం అల్లుకున్న పల్లెతల్లి ఒడిలో పుట్టిపెరిగారు... సొంత ఊరి జనం, అమ్మానాన్నల కమ్మని రాగాలు వింటూ ఎదిగారు... ఆ రాగాలనే అవపోషణ పట్టి ఇప్పుడు అందరినీ మెప్పిస్తున్నారు. మట్టిదనం సువాసనలు అద్దుకున్న పాటలకు వారధులుగా ఓ ప్రైవేటు టీవీ ఛానల్ నిర్వహిస్తున్న పల్లెపాటల రియాలిటీ షోలో తమ తియ్యని గొంతుతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారు. కనుమరుగవుతున్న పల్లెపాటలతో అందరినీ కట్టిపడేస్తున్న పలువురు ‘మట్టిలో మాణిక్యాల’ నేపథ్యంపై ఓ లుక్కేద్దాం...

mm-m-m-m-m.jpg

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి నికి చెందిన ఆదివాసి యువతి సుమలత.. పల్లె పాటలతో అందరినీ కట్టిపడేస్తోంది. తన తియ్యని స్వరంతో అదరగొడుతోంది. అడవితల్లి ఒడిలోనే ఓనమాలు నేర్చుకుని అద్భుతంగా పాడుతోంది. కోయిల పాటలు, ఝుమ్మనే తుమ్మెద సవ్వడులనే గానామృతంగా మలుచుకుని తండ్రి నేర్పిన పాటలను అవపోసన పట్టింది. ఆదిలాబాద్ మన్యం మట్టిలో పుట్టిన ఈ ఆణిముత్యం శెభాష్ అనిపించుకుంటోంది. తన పాటలతో శ్రోతలను విశేషంగా అలరించింది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నల ఆడిపాడుతుంటే చూసేవాళ్లమని, అమ్మానాన్నలు ఏ పని చేసినా పాడేవారని చెప్పింది. పాట వారి నుంచే అబ్బినట్టు తెలిపింది. నాన్న ఆరోగ్యం బాగాలేకపోయినా.. ఇల్లు గడిచే పరిస్థితి లేకపోయినా పాటలంటే ఇష్టం కాబట్టి వెళ్లమని అమ్మ చెప్పిందంటూ సుమలత తన నేపథ్యాన్ని వెల్లడించింది.

Untitled-20.jpg

కర్నూల్‌లోని ఓ గ్రామంలో పుట్టిన సూరీడుది ఇలాంటి గాథే. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన సూరికి పాటంటే ప్రాణం. పాటను ప్రాణంగా ప్రేమిస్తాడతను. అవకాశం దొరికిన ప్రతిసారి తన పాటతో మెప్పిస్తున్నాడు. పల్లె మట్టివాసనను తట్టిలేపే అతడి గానం మనసును హత్తుకుంటోంది. తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య కన్నీళ్లను తుడిచేందుకు ఈ సూరీడు పాటనే నమ్ముకున్నాడు. పాటపాడుతూ జీవనం సాగించాలని కోరుకుంటున్నట్టు, చచ్చేంత వరకు పాట వెంటే పయనిస్తానని చెబుతున్నాడు.

Untitled-27.jpg

మరో సింగర్... వనపర్తి జిల్లా పెబ్బేలు మండలం సూగూరు గ్రామానికి చెందిన భానుప్రియది కూడా ఇలాంటి నేపథ్యమే. తన స్వరాలతో అందరినీ కట్టిపడేస్తోంది. పాటలు పాడడం అమ్మకు చాలా ఇష్టమని, కానీ ఆమె పాడలేకపోవడంతో తనను పాడించాలనుకుందని భానుప్రియ గుర్తుచేసుకుంది. పాట పాడతానంటే తొలుత నాన్న భయపడ్డాడని, కానీ ఆ తర్వాత ప్రోత్సాహించాడని తెలిపింది.

కష్టాల ముళ్లకంచెను అధిగమించి తనను తాను నిరూపించుకుంటున్న జగిత్యాలకు చెందిన శిరీషది ఇలాంటి ప్రస్థానమే. ఆర్థిక కష్టాలతో కట్టుకున్న భర్త దేశం దాటి వెళ్లగా.. చంటి బిడ్డతో జీవనాన్ని కొనసాగిస్తోంది. తండ్రి నేర్పిన జానపదాలను అందంగా పాడుతూ ఆకట్టుకుంటోంది. పుట్టుకతో అబ్బిన కళ కావడంతో పేరు సంపాదించుకుంటోంది.

పల్లెపాటను బతికించుకోవాలని, జానపదాన్ని మళ్లీ జనంలోకి తీసుకెళ్లాలనే తాపత్రయ పడుతున్న ఈ మట్టిలో మాణిక్యాలను అందరూ ప్రశంసిస్తున్నారు. మరుగున పడుతున్న తియ్యనైన పల్లె పాటలను వెలుగులోకి తీసుకొస్తున్నారని అభినందిస్తున్నారు. ఇలాంటి గాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన సారంగదరియా కార్యక్రమాన్ని మెచ్చుకుంటున్నాడు.

Updated Date - 2022-12-01T20:05:08+05:30 IST