సత్య జ్యోతి

ABN , First Publish Date - 2022-09-02T08:57:30+05:30 IST

రెండు వేల సంవత్సరాల క్రితం, ఒకానొక సత్యం... నిలువెత్తు మానవ స్వరూపంలో మన మధ్య తిరుగాడింది. ఆయనే ఏసు ప్రభువు. ఆయన మాటలు ప్రకృతిలో భాగాలు. ఎన్నటికీ, వాడని, మనల్ని వీడని

సత్య జ్యోతి

రెండు వేల సంవత్సరాల క్రితం, ఒకానొక సత్యం... నిలువెత్తు మానవ స్వరూపంలో మన మధ్య తిరుగాడింది. ఆయనే ఏసు ప్రభువు. ఆయన మాటలు ప్రకృతిలో భాగాలు. ఎన్నటికీ, వాడని, మనల్ని వీడని అమృతపు అడుగుజాడలు. తల్లిలా మనల్ని అంటిపెట్టుకొని ఉండే చల్లని నీడలు. కంటికి ప్రత్యక్షంగా కనిపించే కొండ కోనలు, చెట్టు చేమలూ, సూర్య చంద్రులు, నక్షత్రాలు ఎంత సత్యమో... ప్రభువు చెప్పిన మాటలు అంతటి సత్యాలు. 


సత్యం అంటే స్థిరమైనది, శాశ్వతంగా పదికాలాలు నిలిచేది. లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా చెక్కు చెదరకుండా... యుగయుగాల దాకా ఏది నిలిచిపోతుందో... అదే సత్యం. ఆ సత్య సౌందర్యంలో తన్మయమైన లోకం... ఏసును అభిమానించింది, ఆరాధించింది. ఆయనను వెంబడించింది. ఆ సత్యంలా జీవించాలన్న ఆకాంక్షతో అన్వేషిస్తూనే ఉంది. సర్వమానవాళికీ సత్యమార్గం చూపిన ఏసు ప్రభువు... ‘నేనే సత్యం’ అని స్పష్టం చేశాడు. ఆయన అద్భుతాలు చేయడం, నిర్దోషి అయినప్పటికీ శిక్ష అనుభవించి, మరణించడం,  తిరిగి మూడోనాడు పునరుత్థానం చెందడం... ఆయన బోధలు నాటికీ, నేటికీ ఎంతోమంది వేదనలనూ, బాధలనూ తొలగించడం ఇవన్నీ సత్యాలే. ఇన్ని సత్యాలకు మూలకారకుడైన ఏసు... రెండు వేల సంవత్సరాలు దాటినా, మహా ఆధ్యాత్మిక విప్లవకారుడై... విశ్వాసుల హృదయాలను పలకరించడం కూడా సత్యమే.  ఆయన వెలిగించిన సత్య జ్యోతి... మానవ హృదయాల్లోని అంధకారాన్ని తొలగిస్తుంది. అయోమయంలో ఉన్న వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది. నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. 


డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024

Updated Date - 2022-09-02T08:57:30+05:30 IST