మహోన్నత రాత్రి షబె ఖద్ర్
ABN , First Publish Date - 2022-04-22T05:30:00+05:30 IST
రంజాన్ మాసం చివరి పదిరోజుల్లో దైవం అనుగ్రహించిన అత్యంత శ్రేష్టమైన, మహోన్నతమైన
రంజాన్ మాసం చివరి పదిరోజుల్లో దైవం అనుగ్రహించిన అత్యంత శ్రేష్టమైన, మహోన్నతమైన రాత్రి షబె ఖద్ర్ (లైలతుల్ ఖద్ర్). ఈ ఘనమైన రాత్రిలోనే... మానవులకు మార్గదర్శకత్వాన్ని అందించే దివ్య ఖుర్ఆన్ను అల్లాహ్ అవతరింపజేశాడు. షబే ఖద్ర్ నాడు ‘ఖుర్ఆన్ వహీ’ (దైవ సందేశం) ఆవిర్భవించింది. అలాగే 23 సంవత్సరాల వ్యవధిలో... దైవ ప్రవక్తను అల్లాహ్ అవతరింపజేశాడు. అందుకే ఈ రాత్రి వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైనది. వెయ్యి నెలలు అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు. ఈ ఒక్క రాత్రినీ దైవారాధనలో గడిపితే... వెయ్యి మాసాల పుణ్యం లభిస్తుంది. మానవుల ఉపాధి, జీవన్మరణాలు, కర్మలపై నిర్ణయాలు జరిగే రాత్రి ఇది. దైవ దూతలు దివి నుంచి భువికి వచ్చి... దైవ కారుణ్యాన్ని భూమండలమంతా కురిపిస్తారు. ఈ రాత్రి ఎవరైనా తమ తప్పులను, పాపాలను అంగీకరించి... పూర్తి ఏకాగ్రతతో దైవాన్ని క్షమాపణలు కోరుకుంటే.... ఆ క్షమాపణలను దైవం స్వీకరిస్తాడు. ఈ రాత్రి దైవాన్ని కేవలం ఆయన ప్రసన్నత కోసం ఎవరు ఆరాధిస్తారో... వారు దైవం దృష్టిలో అత్యంత గౌరవనీయులవుతారు. అలాకాకుండా... సమయాన్ని వృధా చేసేవారు సకల శుభాలనూ కోల్పోతారు.
‘‘ఘనత కలిగిన ఈ రాత్రిలో దివ్య ఖుర్ఆన్ను మేము అవతరింపజేశాం. ఘనత గల రాత్రి అంటే ఏమిటో మీకు తెలుసా?ఇది వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైనది. అల్లాహ్ ఆజ్ఞతో దైవదూతలు ఆదేశాలను తీసుకొని నేలకు దిగి వస్తారు. ఈ రాత్రి... మరుసటి ఉషోదయం వరకూ ఎంతో శాంతిమయమైనది’’ అని అల్లాహ్ సందేశంగా దివ్య ఖుర్ఆన్ చెబుతోంది.
ఎవరైతే దైవారాధనలో నిమగ్నమై ఉంటారో... వారికోసం దైవదూతలు ప్రార్థన చేస్తారు. దైవ నిర్ణయాలన్నీ మానవాళి మేలు కోసమే. ఈ నిర్ణయాలలో ఎలాంటి చెడులకూ ఆస్కారం లేదు. ఎవరైతే చిత్తశుద్ధితో, దైవ సంతుష్టి కోసం ప్రార్థన చేస్తారో... వారి ప్రతి ఆరాధననూ దైవం స్వీకరిస్తాడు. అయితే... మద్యం తాగేవారు, తల్లితండ్రుల పట్ల దుష్ప్రవర్తనతో మెలిగేవారు, బంధువులతో సంబంధాలను తెంచుకొనేవారు, ఈర్ష్య, ద్వేషం కలిగి ఉండేవారు... వీరి ఆరాధనలను మాత్రం దైవం అంగీకరించడు. రంజాన్ మాసం చివరి రోజుల్లో... అంటే 21, 23, 25, 27. 29 రాత్రుల్లో.. షబె ఖద్ర్ను అన్వేషించాలని దైవ ప్రవక్త మహమ్మద్ సూచించారు.
మహమ్మద్ వహీదుద్దీన్