నీళ్లకు డబ్బు కట్టలేదు! బీర్బల్‌ పంచాయితీ

ABN , First Publish Date - 2022-11-09T00:42:16+05:30 IST

వారం తర్వాత ‘ఇంకా డబ్బులు కావాల’ని పేదరైతుని వేధించాడు టక్కరి రైతు.

నీళ్లకు డబ్బు కట్టలేదు! బీర్బల్‌ పంచాయితీ

అది అక్బర్‌ రాజ్యం. ఆ సమయంలో సుఖ్‌దేవ్‌ అనే ఓ రైతు ఉండేవాడు. అతడు కష్టజీవి. నిజాయితీ మనిషి. తన పొలం పక్కన బాలరాజ్‌ అనే రైతు ఉండేవాడు. అతను టక్కరి. అబద్దాలు చెప్పటంలో అందెవేసిన చేయి. తన పొలం ఎండిపోతుంటే సుఖ్‌దేవ్‌ చూడలేకపోయాడు. అప్పు చేసి మరీ తన పక్క చేను యజమాని బాలరాజ్‌తో ఒక బావి కొన్నాడు. డబ్బులన్నీ కూడా ఇచ్చాడు.

వారం తర్వాత ‘ఇంకా డబ్బులు కావాల’ని పేదరైతుని వేధించాడు టక్కరి రైతు. పేద రైతు ‘నేను ఇవ్వలేను. నీ డబ్బులు ఇచ్చాను’ అంటూ గొడవపడ్డాడు. ఇద్దరూ కొట్లాడారు. పంచాయితీ కాస్త బీర్బల్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. బక్క రైతును చూస్తూనే బీర్బల్‌కి విషయం అర్థమైంది. ఇతను మంచివాడు.. ఆ పక్కరైతు టక్కరని అర్థమైంది. ‘అయ్యా.. నేను నా పక్కచేను యజమానితో తన బావిని కొన్నా. డబ్బులిచ్చా. అయినా మళ్లీ డబ్బులు ఇవ్వాలంటున్నాడు’ అన్నాడు. ఇంతలోనే బాలరాజ్‌ కలుగ చేసుకుని ‘అయ్యా.. నేను బావిని అమ్మాను. నీళ్లను అమ్మలేదు. దానికి డబ్బులు కావాలి కదా’ అన్నాడు. బీర్బల్‌ ఇక వెంటనే కోప్పడుతూ ఇలా అన్నాడు. ‘బాలరాజ్‌.. బావి నీదే కదా?’ అన్నాడు. ‘అవును’ అన్నాడు అతను. ‘బావిని సుఖ్‌దేవ్‌కు అమ్మావ్‌ కదా. నీళ్లు కూడా నీవే కదా?’ అంటూనే.. గట్టిగా ‘అవునవును’ అంటూ గట్టిగా అరిచాడు.

మరింత కోపాన్ని ప్రదర్శిస్తూ బాలరాజ్‌తో బీర్బల్‌ ఇలా అన్నాడు- ‘‘నువ్వు నీ బావిని అమ్మావు. సరే. ఆ బావిలోని నీళ్లు కూడా నీవే అంటున్నావు కదా? అలాగైతే బావిలోని నీళ్లను తోడుకుని అమ్మాలి కదా. నీళ్లన్నీ తోడించి అతని బావి అమ్మాలి’ అన్నాడు. బాలరాజ్‌కు మాటల్లేవ్‌. ‘చూడు బాలరాజ్‌. నీ నీళ్లను సుఖ్‌దేవ్‌ తన బావిలో ఉంచుకుంటున్నాడు. కాబట్టి అందుకు అద్దె కట్టాల్సిందే’ అన్నాడు గట్టిగా బీర్బల్‌. చేసేదేమీ లేక బీర్బల్‌ ముందు తప్పయిందని బాలరాజ్‌ అంగీకరించాడు. ‘నా బుద్ధి గడ్డి తిని ఇలా చేశా. మీ ఇష్టం అయ్యా. ఈ ఒక్కసారి క్షమించండి’ అంటూ వేడుకున్నాడు. బీర్బల్‌ హాస్యచతురత, ఆయన పంచాయితీ చూసి రైతు ఆశ్చర్యపోయి.. నమస్కరించాడు. ధన్యవాదాలు తెలిపాడు.

Updated Date - 2022-11-09T00:43:54+05:30 IST