సోమరుల గెలుపు

ABN , First Publish Date - 2022-11-08T03:53:25+05:30 IST

ఒక అడవిలో తెలివైన సింహం ఉండేది. దానికి జంతువులన్నీ కలిసి మెలిసి ఉండటం ఇష్టం. అయితే ఎవరి బిజీలో వాళ్లున్నారు.

సోమరుల గెలుపు

ఒక అడవిలో తెలివైన సింహం ఉండేది. దానికి జంతువులన్నీ కలిసి మెలిసి ఉండటం ఇష్టం. అయితే ఎవరి బిజీలో వాళ్లున్నారు. ఒక రోజు ఐపీఎల్‌ క్రికెట్‌ చూస్తూ మంత్రి అయిన నక్కగారికి కబురంపింది. మంత్రిగారొచ్చారు. వెంటనే.. ‘చూడండి.. కరోనా తర్వాత మన అడవిలో అంతా మౌనం. గేమ్స్‌ ఆడితే జంతువులు పోగవుతారు కదా’ అని అడిగాడు రాజు. నక్క తెగ సంతోషపడింది. ‘అవును.. మహాప్రభూ.. ఈ ఆలోచన అద్భుతం’ అంటూ ప్రశంసించింది.

అదే అడవిలో ఓ గున్న ఏనుగు, ఒక ఎలుగుబంటి ఉండేవి. రెండూ సోమరులు. ఏ పని చేసేవి కావు. దీంతో అందరూ వాటిని తిట్టేవాళ్లు. పనిలేని సోమరులని తక్కువగా చూసేవారు. దీంతో ఎలాగైనా సరే మనం ప్రతిభావంతులం అని నిరూపించుకోవాలనే తాపాత్రయం వీటిది. నక్క మంత్రిగారికి ఓ ఆలోచన వచ్చింది. ఇతర గేమ్స్‌ కంటే.. రన్నింగ్‌ రేస్‌ బెటర్‌ అది కూడా ట్రాక్‌ డిఫరెంట్‌గా ఉండాలని సూచించింది. దీని వల్ల జనాలు కూడా గుంపులుగా ఒకే చోట పోగవ్వరు అన్నది. ఇదేదో బావుందే అన్నారు మహారాజు. ‘చూడండి.. మహారాజా.. మనం రన్నింగ్‌ ట్రాక్‌కోసం ప్రత్యేకంగా ఖర్చుచేయము. అడవిలోనే ఐదు కిలోమీటర్ల కాలిబాటను చూస్తా. చెట్టు చేమలు, గుట్టలు, నీళ్ల చెరువులు ఆనుకుని ఉండే ట్రాక్‌ను సిద్ధం చేస్తానంది నక్క. ‘భలే మంత్రి’ అన్నారు రాజు. ఇందుకోసం బడ్జెట్‌ కేటాయించారు. అనుకున్న తడవుగానే మరో నక్క దగ్గర కమీషన్‌ తీసుకుని.. దారి ఏర్పరచటానికి బిడ్డింగ్‌ వేయించింది. కాంట్రాక్టర్‌ నక్క అదృష్టమంటే నాదే అనుకుంది. ట్రాక్‌ను బాగా తయారు చేసింది. రన్నింగ్‌ రేస్‌ పోటీలున్నాయని, అందరూ చూడొచ్చని.. ఎవరైనా పాల్గొనవచ్చని చాటింపు వేశారు. అడవంతా ఈ సమాచారం అందుకుంది.

ఎలుగు, ఏనుగు విన్నాయి. చూడటమెందుకు.. పాల్గొందామనుకున్నాయి. రన్నింగ్‌ రేస్‌ ప్రారంభమైంది. వాటిలో జింక, నక్క, తోడేలు, జిరాఫీ, గాడిద, కోతి, గుర్రం.. ఇలా పలురకాల జంతువులున్నాయి. వాటిని చూసి ఇవికాస్త భయపడ్డాయి. అయితే ఏనుగు, ఎలుగుబంటి ఎలాగైనా గెలవాలని చేయికలిపాయి. పోటీ ప్రారంభమైంది. ఆ ట్రాక్‌నుంచి వెళ్తుంటే చిత్తడి నేలల్లో జింకలు చిక్కుకుపోయాయి. నీళ్లు ఉన్నచోట గుర్రం ఆగిపోయింది. ఏనుగు, ఎలుగు శక్తినంతా కూడదీసుకుని చిత్తడి నేలలు, వాగులు దాటుకుని వెళ్తున్నాయి. మధ్యలో ఓ గాడిద ఏనుగు కంటే ముందు పరిగెత్తబోయింది. ఏనుగు వెనకాల నుంచి తంతే.. ఆ గాడిద నీళ్లలో పడిపోయింది. జంతువులన్నీ చూసి ‘ఇది జంబోపంచ్‌’ అంటూ నవ్వాయి. దీంతో జంబోకంటే ముందు వెళ్లటానికి ఏ జంతువులూ సాహసించలేదు. ఎన్నో కష్టాలను ఎదురొడ్డి ట్రాక్‌లో జంబో, ఎలుగుబంటి ప్రథమ,ద్వితీయ స్థానాల్లో వచ్చాయి. ఆ రోజు అడవి జంతువలన్నీ వాటిని పొగిడాయి. ‘సోమరులు’ అని తిట్టించుకున్న చోటే ‘విజేతలు’గా నిలిచారు ఇద్దరు.

Updated Date - 2022-11-08T03:53:26+05:30 IST