‘వన్నెల చిన్నెల నెర కన్నెల వేటల దొర’
ABN , First Publish Date - 2022-06-26T18:13:37+05:30 IST
అంజలీదేవి, ఎన్.టి.ఆర్. నాయికా నాయకులుగా నటించిన ఎన్.ఏ.టి.వారి ‘పాండురంగ మహత్మ్యం’ (అనుభక్త పండరీకుని కథ)

అంజలీదేవి, ఎన్.టి.ఆర్. నాయికా నాయకులుగా నటించిన ఎన్.ఏ.టి.వారి ‘పాండురంగ మహత్మ్యం’ (అనుభక్త పండరీకుని కథ) (28-11-1957) చిత్రంలోనిది ఈ స్టిల్. 1944లో విడుదలైన ‘హరిదాస్’ (తమిళం) చిత్రం ఆధారంగా తీసినది. త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించిన యీ చిత్రంలో ఎన్.టి.ఆర్. పుండరీకుడిగా ప్రేక్షక నీరాజనాలు అందుకున్నారు. చిత్రం నిడివి 15,747 అడుగులు. అయినా అనవరసర సన్నివేశం ఒక్కటీ లేదనిపిస్తుంది. ఇది చిత్ర దర్శకుడైన కమలాకర కామేశ్వరరావు చేసిన మాయ. సముద్రాల జూనియర్ సంభాషణలెక్కడా విసుగు పుట్టించవు.
ఇక ఎన్.టి.ఆర్. తల్లిదండ్రులను ఇంట్లోంచి పంపేసిన కర్కశుడైన కొడుకుగా, ఆ తర్వాత కాళ్లు పోగొట్టుకుని పశ్చాత్తాపుడై, కాళ్లతో దేకుతూ ‘అమ్మా! అని అరచినా ఆలకించవేమమ్మా!’ అని కరుణ రసాన్వితంగా అభినయిస్తూ ప్రేక్షకులను ఏడ్పించేస్తారు. భక్తుడిగా మారాక ‘‘హే! కృష్ణా! ముకుందా! మురారీ’’ అని గానం చేస్తూ భక్తి రసాన్ని పరాకాష్ట స్థితికి తెచ్చేస్తారు. ఈసన్నివేశంలో ఆయన తన్మయుడైపోయి శ్రీకృష్ణుని దర్శించిన తీరు అద్భుతం.
ఈ చిత్రంపై మక్కువతోనే నందమూరి బాలకృష్ణ ‘పాండురంగడు’ చిత్రంలో కథా నాయకుడి పాత్ర పోషించి తండ్రికి తగిన కొడుకని రుజువు చేసుకున్నాడు.
- డా.కంపల్లె రవిచ్రందన్, 98487 20478