Prannoy Roy: ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ గుడ్‌బై.. ఇక ఎన్డీటీవీకి అదానీ మాటే శాసనం..!

ABN , First Publish Date - 2022-11-30T13:18:17+05:30 IST

ఎన్డీటీవీ అనగానే ఎలక్ట్రానిక్ మీడియా గురించి అవగాహన ఉన్నవారికి ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రణయ్ రాయ్. ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ (Prannoy Roy) తాజాగా ఆ ఛానల్ డైరెక్టర్‌ పదవికి..

Prannoy Roy: ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ గుడ్‌బై.. ఇక ఎన్డీటీవీకి అదానీ మాటే శాసనం..!

న్యూఢిల్లీ: ఎన్డీటీవీ అనగానే ఎలక్ట్రానిక్ మీడియా గురించి అవగాహన ఉన్నవారికి ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రణయ్ రాయ్. ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ (Prannoy Roy) తాజాగా ఆ ఛానల్ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ప్రణయ్ రాయ్ భార్య రాధికా రాయ్ (Radhika Roy) కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. Board of RRPR Holding Private Limited అనే NDTV ఛానల్ ప్రమోటర్ గ్రూప్ నుంచి ఈ ఇద్దరూ నిష్క్రమించారు. ఎన్డీటీవీలో మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ (Adani Group) దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో.. ఎన్డీటీవీ అదానీ గ్రూప్ సొంతమైంది. ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు.

తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో.. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్‌ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ఎన్డీటీవీ యాజమాన్యపు హక్కు సొంతం చేసుకునేందుకు ఈ మాత్రం వాటా సరిపోతుంది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేయడంతో నవంబర్ 29న జరిగిన సమావేశంలో RRPRH ప్రమోటర్ గ్రూప్ వారి రాజీనామాలను ఆమోదించింది. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెక్టర్లుగా RRPRH నియమించింది.

ఇదిలా ఉండగా.. బోర్డు డైరెక్టర్లుగా ప్రణయ్ రాయ్, ఆయన భార్య తప్పుకోగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్డీటీవీని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేశారు. ఇప్పటివరకూ ఎన్డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి అదానీ బినామీ అని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కూడా అదానీ విషయంలో ఇదే వైఖరితో ఉంది. దీంతో.. ఇకపై బీజేపీ ప్రో ఛానల్‌గా ఎన్డీటీవీ మారిందన్న సంకేతానిచ్చేలా కేటీఆర్ ఆ ఛానల్‌ను అన్‌ఫాలో చేయడం గమనార్హం.

ఎన్డీటీవీ‌ని అదానీ గ్రూప్ ఎలా సొంతం చేసుకుందంటే..

అదానీ గ్రూప్‌ తాజాగా వార్తా ప్రసార మాధ్యమ రంగంలోకీ ప్రవేశించింది. ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ ‘న్యూ ఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌’లో (ఎన్‌డీటీవీ) మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చర్యలు చేపట్టిందని ఎన్‌డీటీవి చెబుతోంది. లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌డీటీవీలో గౌతమ్‌ అదానీ తొలుత పరోక్షంగా వాటా దక్కించుకున్నారు. ఇందుకోసం ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేశారు. తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

అదానీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. ఇందుకోసం రూ.493 కోట్లు వెచ్చించనున్నాయి. ఎన్‌డీటీవీకి చెందిన 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటీ రూ.294 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపాయి. బీఎస్‌ఈలో ఎన్‌డీటీవీ షేరు ధర గత ఆగస్ట్ 23న 2.61 శాతం పెరిగి రూ.366.20 వద్ద ముగిసింది. ఈ ముగింపు ధరతో పోలిస్తే ఓపెన్‌ ఆఫర్‌ రేటు 19.71 శాతం తక్కువ. సెబీ నిబంధనల ప్రకారం.. ఏదైనా లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం, అంతకు పైగా వాటా కొనుగోలు చేసినప్పుడు తప్పక ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్‌డీటీవీ కొనుగోలుతో తన ప్రధాన వ్యాపార ప్రత్యర్థి ముకేశ్‌ అంబానీతో పోటీని అదానీ మరో మెట్టెక్కించారు. అంబానీ చాలాకాలంగా న్యూస్‌ చానళ్ల విభాగంలో ఉన్నారు. ఆయన యాజమాన్యంలోని నెట్‌వర్క్‌ 18 సంస్థ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స 18, సీఎన్‌బీసీ-టీవీ 18 వంటి వార్తా చానళ్లను నిర్వహిస్తోంది.

Updated Date - 2022-11-30T13:46:51+05:30 IST