Kiren Rijiju: తవాంగ్ భద్రతకు ఢోకా లేదు

ABN , First Publish Date - 2022-12-17T16:26:57+05:30 IST

భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఈనెల 9న ఘర్షణ జరిగిన ప్రాంతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారంనాడు..

Kiren Rijiju: తవాంగ్ భద్రతకు ఢోకా లేదు

తవాంగ్: భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్‌ (Tawang)లో ఇరు దేశాల సైనికుల మధ్య ఈనెల 9న ఘర్షణ జరిగిన ప్రాంతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) శనివారంనాడు పర్యటించారు. అనంతరం తవాంగ్ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని మంత్రి ప్రకటించారు. భారత ఆర్మీకి చెందిన వీర జవాన్లు తగినంత మంది అక్కడ మోహరించినట్టు చెప్పారు. చైనా యుద్ధానికి సన్నద్ధంగా ఉంటే కేంద్రం నిద్రపోతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన ఓ ట్వీట్‌లో తిప్పికొట్టారు.

''రాహుల్ గాంధీ కేవలం భారత ఆర్మీనే అవమానించడం లేదు, దేశ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సమస్య కాదు, దేశాన్ని కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాడు. మన సాయుధ బలగాలను చూసి దేశం గర్విస్తోంది'' అని ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ స్థానికులు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన ఒక వీడియోను కూడా మంత్రి షేర్ చేశారు.

రాహుల్ ఏమన్నారు?

తవాంగ్ ఏరియాలో చైనా తెగింపు, కేంద్రం అలసత్వంపై రాహుల్ గాంధీ శుక్రవారంనాడు రాజస్థాన్‌‌లో విమర్శలు గుప్పించారు. చైనా కేవలం చొరబాటులకే పరిమితం కాకుండా యుద్ధానికి సన్నద్ధమవుతోందని, కేంద్ర మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, నిద్రపోతోందని, వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. దేశాన్ని తప్పుదారి పట్టించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని, భారత సైనికుల శౌర్యాన్ని చిన్నబుచ్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. ఇది 1962 నెహ్రూ ఇండియా కాదని ఎద్దేవా చేసింది.

Updated Date - 2022-12-17T16:29:52+05:30 IST