India China Troops Clash: వాస్తవాధీన రేఖ వద్ద మరో ఘర్షణ.. కొట్టుకున్న భారత్-చైనా బలగాలు

ABN , First Publish Date - 2022-12-12T21:07:12+05:30 IST

భారత్, చైనా బలగాల మధ్య (India - China Troops Clash) మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ నుంచి ఇరు సైన్యాల ఉపసంహరణ సమయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

India China Troops Clash: వాస్తవాధీన రేఖ వద్ద మరో ఘర్షణ.. కొట్టుకున్న భారత్-చైనా బలగాలు

న్యూఢిల్లీ: భారత్, చైనా బలగాల మధ్య (India - China Troops Clash) మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ నుంచి ఇరు సైన్యాల ఉపసంహరణ సమయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు సేనలు కొట్లాటకు దిగిన ఈ చిన్నపాటి ఘర్షణలో ఇరువైపులా పలువురు సైనికులు, అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఘర్షణ తర్వాత ఇరుదేశాల బలగాలు అక్కడి నుంచి ఎవరివైపు వారు వెనక్కి వెళ్లిపోయారని వెల్లడించాయి. తవాంగ్ సెక్టార్‌లోని యంగ్‌స్టే ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. ఈ ప్రతిష్ఠంభనలో ఆరుగురు భారతీయ సైనికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని గువహటి తరలించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ప్రతిష్టంభన చోటుచేసుకుంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటడాన్ని భారతీయ సైనికులు గట్టిగా ప్రతిఘటించారు. 300లకుపైగా మంది చైనా సైనికులు దాదాపు 17 వేల అడుగుల ఎత్తైన పర్వత శిఖరం మీదకు ఎక్కేందుకు ప్రయత్నించారు. అక్కడున్న భారతీయ పోస్టును పెకిలించే ప్రయత్నం చేశారు. కానీ భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే ఘర్షణ తర్వాత ఇరుసేనలూ ఆ ప్రాంతం వెనక్కి వెళ్లిపోయాయని రక్షణ వర్గాలు తెలిపాయి. కాగా ఈ ప్రాంతమంతా మంచుపరచుకుని ఉంటుంది.

కాగా తూర్పు లద్దాఖ్‌లో గాల్వాన్ లోయలో ఇరుదేశాల బలగాల మధ్య భారీ ఘర్షణ, ఆ తర్వాత ప్రతిష్ఠంభన పరిస్థితుల తర్వాత జరిగిన మొట్టమొదటి ఘర్షణ ఇదే కావడం గమనార్హం.

Updated Date - 2022-12-12T21:20:45+05:30 IST