New Delhi: కన్నకొడుకే కాలయముడయ్యాడు

ABN , First Publish Date - 2022-11-23T17:46:20+05:30 IST

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులను కన్నకొడుకే...

New Delhi:  కన్నకొడుకే కాలయముడయ్యాడు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో (Delhi palam Area) ఒకే కుటుంబంలోని నలుగురు కత్తిపోట్లతో దారుణ హత్యకు గురయ్యారు. కన్న కొడుకే కాలయముడై తన తండ్రి, తల్లి, అమ్మమ్మ, సోదరిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనమైంది.

సంఘటన వివరాల ప్రకారం, పాలెం పోలీస్ స్టేషన్‌కు రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నట్టు ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు రక్తం మడుగులో పడి ఉండటం వారికి కనిపించింది. తల్లిదండ్రుల మృతదేహాలు బాత్‌రూంలో పడి ఉండగా, సోదరి, అమ్మమ్మ మృతదేహాలు వారి బెడ్‌రూమ్‌లలో పడి ఉన్నాయి. హంతకుడు కేశవ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, 25 ఏళ్ల కేశవ్ అనే యువకుడు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డాడు. మాదకద్రవ్యాలకు బానిస కావడం, గత దీపావళి నుంచి నిలకడైన సంపాదన లేకపోవడంతో ప్రతి రోజూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. కేశవ్ పదునైన ఆయుధంతో నలుగురు కుటుంబ సభ్యుల గొంతులు కోసి, పలుమార్లు కత్తితో పొడిచినట్టు పాలం పోలీసులు తెలిపారు. అతను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు గుర్తించారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-23T18:20:45+05:30 IST