Shraddha case: అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్.. కోర్టు ఓకే

ABN , First Publish Date - 2022-11-17T17:13:28+05:30 IST

తన ప్రియురాలు శ్రద్ధాను దారుణంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్‌కు ఢిల్లీ కోర్ట్ షాకిచ్చింది.

Shraddha case: అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్.. కోర్టు ఓకే
Aftab Poonawala

న్యూఢిల్లీ: తన ప్రియురాలు శ్రద్ధా (Shraddha)ను దారుణంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్‌ (Aftab Poonawala )కు ఢిల్లీ కోర్ట్ (Delhi court) షాకిచ్చింది. మరో ఐదు రోజుల పోలీస్ రిమాండ్‌కు అప్పగించింది. కోర్టు ఇప్పటికే విధించిన కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రవేశపెట్టారు. పది రోజుల కస్టడీ విధించాలని కోరారు. అయితే కోర్టు అఫ్తాబ్‌కు ఐదు రోజుల రిమాండ్‌కు అప్పగించింది. నార్కో అనాలిసిస్ టెస్టులకు (Narco analysis test) కూడా కోర్టు అనుమతించింది. దీంతో అసలు విషయాలు పూర్తిగా వెలుగులోకి రానున్నాయి. అఫ్తాబ్, శ్రద్ధా గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌కు కూడా వెళ్లడంతో ఢిల్లీ పోలీసులు అతడిని ఆ రాష్ట్రాలకు తీసుకెళ్లనున్నారు.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు శ్రమించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ముక్కలుగా కోసేముందు శ్రద్ధా శవంపై వేడినీళ్లు పోశాడు. సులభంగా కోసేందుకు అవకాశం ఉంటుందని అలా వేడినీళ్లు పోసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చాడు. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధాను ఆరు నెలల క్రితమే దారుణంగా చంపి ఏమీ తెలియనట్లుగా ఉంటోన్న అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపడంతో చేసిన ఘాతుకాన్ని ఒప్పుకున్నాడు.

పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వీటిని గుర్తిస్తారు. ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఇప్పటివరకూ ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించలేకపోయారు.

Updated Date - 2022-11-17T17:29:34+05:30 IST