Rajiv assassination case: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంలో కేంద్రం పిటిషన్

ABN , First Publish Date - 2022-11-17T21:09:14+05:30 IST

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi assassination case) ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) సవాలు చేసింది.

Rajiv assassination case: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంలో కేంద్రం పిటిషన్

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi assassination case) ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) సవాలు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది. ఈ కేసులో కోర్ట్ జారీ చేసిన ఆదేశాలు లోపభూయిష్టమని, దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది. దేశం జన స్రవంతి, శాంతి, సామరస్యం, నేర న్యాయ వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే ఈ తరహా వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా ముఖ్యమని పేర్కొంది.

కాగా రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు విముక్తి కల్పిస్తూ గతవారమే సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఇతర ఏ కేసుల్లోనూ అవసరం లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది. దాంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-17T23:02:02+05:30 IST