Shraddha Case: శ్రద్ధాను చంపిన ఆయుధాలను, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-11-28T16:21:34+05:30 IST

ప్రియురాలు శ్రద్ధా (Shraddha Walkar)ను 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్‌(Aftab Poonawala) ఆమె ఉంగరాన్ని మరో ప్రియురాలికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.

Shraddha Case: శ్రద్ధాను చంపిన ఆయుధాలను, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
Aftab Shraddha

న్యూఢిల్లీ: ప్రియురాలు శ్రద్ధా (Shraddha Walkar)ను 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్‌(Aftab Poonawala) ఆమె ఉంగరాన్ని మరో ప్రియురాలికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. పోలీసులు ఆ ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధాను ముక్కలుగా కోసేటప్పుడు ఆమె చేతికున్న బంగారు ఉంగరాన్ని జాగ్రత్తగా బయటకు తీసినట్లు ఆఫ్తాబ్ ఇప్పటికే పోలీసులకు వెల్లడించాడు. ఆ తర్వాత తన మరో గాళ్‌ఫ్రెండ్‌కు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆమె దగ్గర్నుంచి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు శ్రద్ధాను చంపడానికి, ముక్కలుగా కోయడానికి ఆఫ్తాబ్ వాడిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫ్తాబ్‌పై అభియోగాలు నిరూపించేందుకు పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించినట్లైంది.

మరోవైపు ఢిల్లీ కోర్టు(Delhi court) 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు అఫ్తాబ్‌‌ను తీహార్ జైలుకు తరలించారు.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో అఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు శ్రమించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ముక్కలుగా కోసేముందు శ్రద్ధా శవంపై వేడినీళ్లు పోశాడు. సులభంగా కోసేందుకు అవకాశం ఉంటుందని అలా వేడినీళ్లు పోసినట్లు అఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చాడు. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధాను ఆరు నెలల క్రితమే దారుణంగా చంపి ఏమీ తెలియనట్లుగా ఉంటోన్న అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపడంతో చేసిన ఘాతుకాన్ని ఒప్పుకున్నాడు.

పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వీటిని ఆమెవేనని గుర్తించారు.

శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన వెంటనే ఓ మహిళను తన ఫ్లాట్‌కు పిలిచి ఆమెతో అఫ్తాబ్ డేటింగ్ చేశాడు. ఆ మహిళ ఎవరనేది పోలీసులు కూపీ లాగి ఆమె వృత్తిరీత్యా ఒక డాక్టర్ అని గుర్తించారు. ఆమెను కాంటాక్ట్ చేసిన పోలీసులు వృత్తిరీత్యా ఆమె ఒక సైకియాట్రిస్ట్ అని తెలుసుకున్నారు. మొబైల్ డేటింగ్ అప్లికేషన్ బంబ్లే ద్వారా ఆ మహిళను అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఇదే బంబ్లే నుంచి రెండేళ్ల క్రితం శ్రద్ధను అఫ్తాబ్ కలుసుకున్నాడు.

ఢిల్లీ పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా డేటింగ్ అప్లికేష్ బంబ్లే‌కు లేఖ రాశారు. ఇదే వేదిక నుంచి పలువురు మహిళలను అఫ్తాబ్ కలుసుకున్నట్టు వారి విచారణలో వెల్లడైంది. కాగా, ఈ కేసులో అఫ్తాబ్‌కు రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో పోలోగ్రాఫ్ పరీక్ష చేశారు. పోలోగ్రాఫ్ పరీక్షకు సంబంధించి అన్ని సెషన్లు పూర్తయ్యాయని, ప్రీ, మెయిన్, పోస్ట్ అనే మూడు స్టేజ్‌లు ఈ పరీక్షలో ఉంటాయని ఎఫ్ఎస్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. నిపుణులు ఈ పరీక్షలను విశ్లేషించి రిపోర్ట్ రూపొందిస్తారని చెప్పారు. నివేదిక ఆధారంగా నార్కో అనాలసిస్ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-11-28T16:21:36+05:30 IST