విద్యా సంస్థలపై కక్ష ఎందుకు?

ABN , First Publish Date - 2022-10-11T15:46:53+05:30 IST

వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, చివరకు విద్యా సంస్థలను కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలుగుదేశం

విద్యా సంస్థలపై కక్ష ఎందుకు?

సామాన్యులను ఇబ్బంది పెట్టే రాజకీయం సరికాదు: చంద్రబాబు



అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, చివరకు విద్యా సంస్థలను కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. సోమవారం ఆయన దీనిపై ఒక ట్వీట్‌ చేశారు. ‘‘అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదు. రాష్ట్రంలో జగన్‌ రెడ్డి మొదటి రోజు నుంచి ఇదే చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు విట్‌, ఎస్‌ఆర్‌ఎం వంటివి వచ్చాయి. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకొంటున్నారు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.


కనీసం రోడ్డు సదుపాయం కల్పించకపోవడం, ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం ఎంతటి దారుణమైన మానసిక స్థితి. ఆ విద్యాసంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. మీ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండవచ్చు. కాని అవి ఇలా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఇటువంటి ఆలోచనలు రాష్ట్రానికి గౌరవం కాదు’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-10-11T15:46:53+05:30 IST