private పాఠశాలల్లో పేదలకు 25% సీట్లు ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2022-07-18T21:02:03+05:30 IST

ప్రెవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) అమలుచేసి తీరాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు కచ్చితంగా

private పాఠశాలల్లో పేదలకు 25% సీట్లు ఇవ్వాల్సిందే

విద్యా హక్కు చట్టం నిబంధనల్లో సవరణలు 


అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రెవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) అమలుచేసి తీరాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు కచ్చితంగా 25 శాతం సీట్లను కేటాయించాలని పేర్కొంది. 2010లో రూపొందించిన ఆర్టీఈ నిబంధనలకు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటి ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాల కనీసం 25 శాతం సీట్లను పేదలకు కేటాయిస్తున్న విషయం ప్రజలకు తెలిసేలా నోటీసు జారీ చేయాలి. ఆ సీట్లను ఉచిత కోటాలో మాత్రమే భర్తీ చేయాలి. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేయడంతో పాటు ఒకటో తరగతిలో గత మూడేళ్ల సగటుకు తగ్గకుండా సీట్లు ఉంచాలి. పాఠశాల విద్యా శాఖ రూపొందించే పోర్టల్‌లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది.  పోర్టల్‌ రూపకల్పన బాధ్యతను పాఠశాల విద్య కమిషనర్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఆన్‌లైన్‌లో లాటరీ విధానంలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. నోటిఫికేషన్‌ జారీచేసిన మూడు నెలల్లో రాష్ట్రస్థాయి సలహా మండలి ఏర్పాటుచేస్తారు.


అలాగే జిల్లాస్థాయిలో పర్యవేక్షణకు కమిటీలు నియమిస్తారు. పేదల కోటాలో చేరిన విద్యార్థుల పట్ల యాజమాన్యాలు వివక్ష చూపడం, వేధింపులకు పాల్పడటం లాంటి ఫిర్యాదుల పరిష్కార బాధ్యతను ప్రభుత్వం డీఈవోలకు అప్పగించింది. ఎవరైనా విద్యార్థి దరఖాస్తును తిరస్కరిస్తే, కారణాలను తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఆర్టీఈ చట్టం నిబంధనల ప్రకారం కిలోమీటరు పరిధిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులతో భర్తీ కాకపోతే, ఆ పరిధిని 3 కిలోమీటర్లకు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకా ఖాళీలుంటే పాఠశాల విద్య కమిషనర్‌ అనుమతితో 5 కిలోమీటర్ల వరకూ పెంచుకోవచ్చని తెలిపింది. 


తల్లిదండ్రుల కోసం హెల్ప్‌ డెస్క్‌లు 

విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా పేదలకు సీట్ల కేటాయింపులో తల్లిదండ్రులకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తగిన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. వారి కోసం జిల్లా కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.

Updated Date - 2022-07-18T21:02:03+05:30 IST