పాఠాలు చెప్పేదెప్పుడు..?
ABN , First Publish Date - 2022-08-24T20:54:25+05:30 IST
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(Kasturba Gandhi Girls Vidyalaya)(కేజీబీవీ)ల్లో ప్రభుత్వం ఆర్భాటంగా కళాశాలలను ఏర్పాటు చేసింది తప్ప.. బోధన గురించి పట్టించుకోవట్లేదు. విద్యార్థినులు కళాశాలలో చేరి రెండు నెలలైనా బోధన మొదలవలేదు. కనీసం అధ్యాపకులను
ఆర్భాటంగా కేజీబీవీల్లో కళాశాలల ఏర్పాటు
రెండు నెలలైనా అధ్యాపకులను నియమించని దుస్థితి
ప్రారంభంకాని తరగతులు
విద్యార్థినుల భవిష్యత్తుతో చెలగాటం
ఆందోళనలో తల్లిదండ్రులు
కదిరి: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(Kasturba Gandhi Girls Vidyalaya)(కేజీబీవీ)ల్లో ప్రభుత్వం ఆర్భాటంగా కళాశాలలను ఏర్పాటు చేసింది తప్ప.. బోధన గురించి పట్టించుకోవట్లేదు. విద్యార్థినులు కళాశాలలో చేరి రెండు నెలలైనా బోధన మొదలవలేదు. కనీసం అధ్యాపకులను కూడా నియమించలేదు. దీంతో కాలేజీలో చేరిన విద్యార్థినులు.. పాఠాలు ఎప్పుడు చెబుతారోనని ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికే రెండు నెలలు వృథా అయిందనీ, ఇంకెప్పుడు ప్రారంభిస్తారోనని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధ్యాపకులను నియమించేదెన్నడు? వారు పాఠాలు చెప్పేదెన్నడని నిట్టూరుస్తున్నారు. పిల్లల భవిష్యతతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మీనమేషాలు
పేద బాలికల కోసం కేజీబీవీలను గతంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బేటీ బచావో.. బేటీ పడావో.. కార్యక్రమానికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం.. కేజీబీవీల్లో కళాశాలలను ప్రారంభించింది. రెండు నెలలైనా తరగతులు ప్రారంభం కాలేదు. అడ్మిషన పొందిన విద్యార్థినులు తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కళాశాలలను ప్రారంభించిందే తప్ప, అందులో పాఠాలు చెప్పడానికి ఇప్పటివరకు అధ్యాపకులను నియమించలేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో తరగతులు ప్రారంభమై రెండునెలలు పూర్తవుతోంది. ఆ పాఠాలు ఎప్పుడు చెబుతారనీ, సిలబస్ ఎప్పుడు పూర్తి చేస్తారని కేజీబీవీ విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
రెసిడెన్షియల్ కళాశాల అయినందునే మొగ్గు
ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల భద్రత అగమ్యగోచరంగా ఉంది. కళాశాలకు వెళ్లి ఇంటికి రాని బాలికలు ఎంతోమంది ఉన్నారు. వివిధ కారణాలతో విద్యార్థినులు తమ చదువును అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. బాలికలకు భద్రతతోపాటు, ఇతర ఇబ్బందుల కారణంగా పదో తరగతి తరువాత చదువు ఆపించేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు.. పట్టణాలకు అమ్మాయిలను పంపడానికి జంకుతున్నారు. ఈ సమయంలో కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేజీబీవీల్లో కళాశాలలు ప్రారంభించడంతో సంతోషించారు. తమ పిల్లలకు భద్రతతోపాటు, చదువుకూడా ఉచితంగా అందనుండడంతో కేజీబీవీ కళాశాలల్లో చేర్పించడానికి ముందుకొస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను చూశాక, తమ బిడ్డల చదువు ఎలా సాగుతుందో.. భవిష్యత ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
అధ్యాపకులను నియమించకుండానే..
మండలానికొక కేజీబీవీ కళాశాలను ఏర్పాటు చేశారు. వీటిలో అధ్యాపకులను మాత్రం నియమించలేదు. సాధారణంగా గెస్ట్ లెక్చరర్లతో తరగతులు కొనసాగిస్తారు. వారిని కూడా ఇంతవరకు నియమించలేదు. హడావుడిగా అనుమతులిచ్చారే తప్ప, తరువాత విద్యార్థినుల భవిష్యత గురించి పట్టించుకోవట్లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. రెండునెలలు పూర్తయినా, ఇంకా నియామకాల నోటిఫికేషనే వెలువడలేదు. అధ్యాపకుల నియామకానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధ్యాపకులను నియమించాలని విద్యార్థినుల తల్లిదండులు కోరుతున్నారు.
వేధిస్తున్న గదుల కొరత
ప్రస్తుతం కేజీబీవీల్లో రెండు వందల మంది వరకు ఉండడానికి అవకాశముంది. అదనంగా కళాశాలలో 40 మంది చేరితే వారికి వసతి, తరగతి గదుల్లేవు. ఈకారణంతోనే అధికారులు.. కొత్త కళాశాలలను ఇంతవరకు ప్రారంభించలేదని తెలుస్తోంది. ఉన్న గదుల్లోనే నడపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదనపు గదులు మంజూరైనా, వాటి నిర్మాణానికి ఏడాది పట్టే అవకాశముంది. దీంతో కళాశాలలు ప్రారంభిస్తారా.. లేదా.. అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలైనా..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో 25 కళాశాలలు ఉండేవి. అదనంగా 37 పాఠశాలల్లో కళాశాలలను ప్రాంభించారు. కళాశాలకు ఒక గ్రూపును కేటాయిస్తూ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. 40 సీట్లు కేటాయించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు కొన్నిచోట్ల మొదటి విడత అడ్మిషన్లు పూర్తి చేశారు. 40 సీట్లకుగాను 25 మందికిపైగా అడ్మిషన పొందారు. రెండోవిడత అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. మొదటివిడత అడ్మిషన పొంది రెండు నెలలవుతోంది. ఇంతవరకు వారికి తరగతులు ప్రారంభించలేదు. రెండు నెలల పాఠాలు ఏవిధంగా చదువుకోవాలని విద్యార్థినులకు బోధపడడం లేదు. రెండేళ్ల తరువాత ఇంటర్ విద్యార్థినులు నీట్, ఐఐటీ, ఎంసెట్ లాంటి పరీక్షలు రాయాల్సి ఉంది. తరగతుల ప్రారంభానికే రెండు నెలలు తీసుకుంటే, ఇక పాఠాలు ఏం చెబుతారని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. సెప్టెంబరులో అయినా తరగతులు ప్రాంభమవుతాయో.. లేదో.. అని ఎదురు చూస్తున్నారు.
త్వరలోనే తరగతులు ప్రారంభిస్తాం..
కొత్తగా ఏర్పాటు చేసిన కేజీబీవీ కళాశాలల్లో వారంలోగా అధ్యాపకులను నియమిస్తాం. తరగతులను త్వరలో ప్రారంభిస్తాం.
-తిలక్ విద్యాసాగర్, ఏపీసీ, సమగ్రశిక్ష