ఏయూ క్యాంపస్లో చీకటి కార్యకలాపాలు! వ్యభిచారం కోసం చెట్లపై పడకలు
ABN , First Publish Date - 2022-05-27T20:27:52+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అసాంఘిక వ్యవహారాలు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా వ్యభిచారం, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు గురువారం బయటపడింది. విశ్వవిద్యాలయంలోని ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు...

వేలాదిగా ఖాళీ మద్యం సీసాలు, డ్రగ్స్ సిరంజీలు
గుట్టల కొద్దీ కండోమ్స్ ప్యాకెట్లు లభ్యం
విశాఖపట్నం/ఏయూ క్యాంపస్(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అసాంఘిక వ్యవహారాలు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా వ్యభిచారం, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్టు గురువారం బయటపడింది. విశ్వవిద్యాలయంలోని ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. తుప్పలతో నిండిన ప్రాంతాన్ని వారం రోజులుగా శుభ్రం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో తుప్పలను తొలగిస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో వెదురు మొక్కలు గుబురుగా పెరగడంతో ఈ ప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకు ఇస్తూ, కండోమ్లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. యువతీ యువకులు అక్కడకు వచ్చి మత్తుమందులు సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటున్నారు. మద్యం తాగుతున్నారు. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా.. వేలాది ఖాళీ మద్యం సీసాలు, వందల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. చెట్లపై వ్యభిచారం కోసం ఏర్పాటుచేసిన పడకలు ఉన్నాయి. క్యాంప్సలోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆ పరిసరాలన్నీ అసాంఘిక వ్యవహారాలకు అడ్డాగా మారిపోయాయి.

