ఆన్లైన్లో బిట్స్ పిలానీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్..
ABN , First Publish Date - 2022-09-13T20:25:48+05:30 IST
శ, విదేశీ విద్యార్థుల కోసం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్(BSc Computer Science) కోర్సును ఆన్లైన్లో ప్రారంభించనున్నట్లు బిట్స్
కోర్సెరా భాగస్వామ్యంతో అందుబాటులోకి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశ, విదేశీ విద్యార్థుల కోసం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్(BSc Computer Science) కోర్సును ఆన్లైన్లో ప్రారంభించనున్నట్లు బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సుందర్(BITS Pilani Director Professor G. Sundar) ప్రకటించారు. ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన కోర్సెరాతో కలిసి ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సోమవారం బిట్స్ పిలానీ క్యాంప్సలో కోర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టీవాండెన్ బోష్తో కలిసి ఆయన మాట్లాడారు. నాస్కామ్-జిన్నోవ్ నివేదిక ప్రకారం దేశంలో 2026 నాటికి 14 లక్షల నుంచి 19 లక్షల దాకా సాంకేతిక ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే.. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆన్లైన్ కోర్సు ద్వారా.. సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలపర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, డేటా ఎనలిస్ట్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ మందిని సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. ఈ కోర్సుకు ఎలాంటి ప్రవేశపరీక్షా ఉండదని.. సైన్స్, గణిత నేపథ్యం లేకున్నా, 12వ తరగతి, తత్సమానమైన అర్హతగలవారెవరైనా ఈ కోర్సు చేయవచ్చని వివరించారు. ఈ మూడేళ్ల కోర్సును ఆరేళ్లలోగా పూర్తిచేయాలన్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున 30 సబ్జెక్టులు ఉంటాయని.. వారానికి 25 గంటలు ఆన్లైన్ క్లాసులు ఉంటాయని చెప్పారు. సెమిస్టర్కు రూ.52,167 చొప్పున చెల్లించాలని, సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుందని వివరించారు.