హిజాబ్ వెనుక రగులుతున్న ప్రజాస్వామ్య ఆకాంక్ష

ABN , First Publish Date - 2022-10-07T06:03:15+05:30 IST

ఇరవై రెండేళ్ళ ఇరానియన్ యువతి మెహసా అమీని తలమీద హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదని సెప్టెంబర్ 14న ఇరానియన్ సన్మార్గ పోలీసుల (ఘస్తే ఇర్షాద్/ మొరాలిటీ పోలీసులు) అరెస్టు చేశారు....

హిజాబ్ వెనుక రగులుతున్న ప్రజాస్వామ్య ఆకాంక్ష

ఇరవై రెండేళ్ళ ఇరానియన్ యువతి మెహసా అమీని తలమీద హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదని సెప్టెంబర్ 14న ఇరానియన్ సన్మార్గ పోలీసుల (ఘస్తే ఇర్షాద్/ మొరాలిటీ పోలీసులు) అరెస్టు చేశారు. పోలీసుల హింసకి సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. సన్మార్గ పోలీసులు చేసిన హత్యల్లో ఇది మొదటిది కాదు, చివరిది కాకపోవచ్చు. కానీ మెహసా అమీని కస్టోడియల్ హత్య తర్వాత మొదలయిన తీవ్ర నిరసనలు ఇరాన్‌ని కుదిపేస్తున్నాయి. ఇంతకు ముందెప్పుడూ లేని స్థాయిలో స్త్రీలు తమ హిజాబ్‌ని తగులబెట్టటం, సన్మార్గ పోలీసులని నేరుగా వ్యతిరేకించటం, పోలీసు వ్యాన్లకి కూడా ఎదురెళ్లటం చేస్తున్నారు. ఇంకోపక్క నిరసనకారులు ఇరానియన్ విప్లవంతో స్థాపించబడిన ఇస్లానిక్ రిపబ్లిక్‌కి మూలస్తంభాలైన గార్డియన్ కౌన్సిల్‌ని, రిపబ్లికన్ గార్డుల వ్యవస్థని, అసలు ఇస్లానిక్ రిపబ్లిక్ అన్న భావననే ప్రశ్నించటం మొదలుపెట్టారు.


ఇస్లామిక్ రిపబ్లిక్ ఫ్రెంచ్ సిద్ధాంతకర్త మిచెల్ ఫ్యూకో వర్ణించినట్లు విప్లవాత్మక భావన. దీర్ఘ చరిత్ర ఉన్న పర్షియాని పాశ్చాత్య వలసవాదులు తమ వశం చేసుకుని తమకు అనుకూలమైన రాజు షా పెహల్వీని గద్దెనెక్కించి దేశ వనరులని దోచుకోవటాన్ని ఇరాన్ ప్రజలు సహించలేకపోయారు. 1979లో వివిధ రకాల ఇస్లామిస్టులు, వివిధ రకాల కమ్యూనిస్టులు, స్త్రీవాదులు, ప్రజాస్వామ్య వాదుల కూటమి నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్‌ని స్థాపించుకున్నారు. ఇస్లాం, ఆధునికత, గణతంత్ర వ్యవస్థ మూడూ కలిసిన వ్యవస్థని నిర్మించుకోవాలనే వారి ఆలోచన ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పాశ్చాత్య దేశాలు దాన్ని గేలి చేశాయి. ఇరాన్‌పై పొరుగు దేశం ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ చేసిన దాడిని సమర్థించాయి. ఆ యుద్ధంలో ఇరాన్ లక్షల మంది ప్రజలని పోగొట్టుకుంది.


ఇరాన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ ఈ యుద్ధ కాలంలో వేళ్లూనుకుని, విప్లవం తర్వాత సంక్షోభాలని ఎదుర్కొన్న అనేక దేశాల లాగే, నిరంకుశ రాజ్య ధోరణులను అలవర్చుకుంది. మతాన్ని తన చేతుల్లో ఒక ఆయుధంగా మార్చుకుంది. తమంతట తాము పెద్ద ఎత్తున షా వ్యతిరేక పోరాటంలో పాల్గొని, ఇస్లామిక్ విప్లవాన్ని కోరుకున్న దేశ స్త్రీలపై హిజాబ్‌ని, వదులు బట్టలు వేసుకోవటాన్ని డ్రెస్ కోడ్‌గా అమలు చేసింది. దాన్ని అమలు చెయ్యటానికి సన్మార్గ పోలీసు వ్యవస్థని నెలకొల్పింది. ప్రభుత్వ వ్యతిరేకతని కఠినంగా నియంత్రించటానికి రిపబ్లికన్ గార్డుల వ్యవస్థని ఏర్పరిచి, గత నలభై ఏళ్లల్లో అనేక మందిని జైళ్లల్లో బంధించి, హింసించి, చంపించింది.


విప్లవం తర్వాత ఏర్పడిన రిపబ్లిక్‌లో అన్నింటి కన్నా శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ పన్నెండు మంది మగ మత గురువులతో కూడుకున్నదే. వాళ్ళే ఇరాన్ ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులని నియమిస్తారు. అధ్యక్ష పదవికి అభ్యర్థులను వాళ్ళే ఎంపిక చేస్తారు. అయితే ఇరాన్‌లో రాజ్యం ఇలా అన్ని అధికారాలు తీసుకోవటం, రిపబ్లిక్‌నూ ఎన్నికలనూ నియంత్రించటం, గార్డియన్ కౌన్సిల్ అన్ని రకాల అధికారాల్ని చెలాయించటం, మతపరమైన నియమాలని అమలు చెయ్యటం షియా ఇస్లాంలో అన్నింటికన్నా శక్తివంతమైన మత కేంద్రం కోమ్ నగరం లోని మత గురువులతో సహా ఎవరూ పూర్తిగా సమర్థించలేకపోయారు. కోమ్ నగరంలో చదువుకున్న వాళ్ళలో సంస్కరణ వాదులు, మిత వాదులు, అతి వాదులు అందరూ ఉంటూ వచ్చారు. వీరిలో సంస్కరణ వాదిగా పేరున్న 2009 అధ్యక్ష అభ్యర్థి మౌసావి ఉన్నాడు, హిజాబ్ వంటి డ్రెస్ కోడ్ నియమాలని పెద్దగా పట్టించుకోవద్దని నిర్దేశించిన ఇంతకు ముందు అధ్యక్షుడు హసన్ రౌహానీ ఉన్నాడు, చిన్నతనంలోనే ఐదువేల మంది ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ ఖైదీలని ఉరికంబం ఎక్కించి, రాజ్యాధికారపరంగానూ మతపరంగానూ కఠిన ధోరణులని అవలంబిస్తున్న ఇప్పటి ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసి కూడా ఉన్నాడు.


ఇరాన్‌లో ఇటువంటి నిరంకుశ ధోరణులు పెరగటంలోను, ఇస్లామిక్ గణతంత్ర రాజ్యాన్ని కూలగొట్టడంలోను పాశ్చాత్య దేశాలు తమ వంతు సహకారం అందించాయి. ఇరాన్ ఆర్థిక వ్యవ్యస్థ దెబ్బ తిని, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువై లోపలి నుంచే దేశం కుప్పకూలాలన్నది వీళ్ళ ఆశ. అయితే ఇరాన్ రాజ్యం, ప్రభుత్వం, ప్రజలు దీనిని గట్టిగానే తట్టుకున్నారు. గణతంత్ర స్వభావాన్ని ఇరాన్ రాజ్యం అలవర్చుకుంది. ఆహారం, పెట్రోలు, నీళ్లు, అలాగే న్యాయం, ఆరోగ్యం సాధారణ ప్రజలకి సాధ్యమైనంత అందుబాటులో ఉంచింది. స్త్రీలకి రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులున్నాయి. కొంతమంది అధ్యక్షులు కఠిన ధోరణులు అవలంబిస్తే, మరికొంతమంది సంస్కరణవాదులుగా ఉంటూ వచ్చారు. మొన్నీ మధ్య జరిపిన సర్వేలో కూడా రిపబ్లిక్‌కి మూలసూత్రాలైన అమెరికన్ వ్యతిరేకత, ఇజ్రాయిల్ వ్యతిరేకతలని అత్యధిక ప్రజలు సమర్థించారు.


కానీ ఇస్లామిక్ స్ఫూర్తితో ఏర్పడిన గణతంత్ర రాజ్యం ఉండాల్సిన రీతిలో ఉండటం లేదని, ప్రభుత్వం అట్లా పనిచెయ్యట్లేదని, తమకు ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదని ఇరాన్ ప్రజలు వీలున్నప్పుడల్లా పోరాడారు. 1980లలో ఖోమేనీ మీద మార్క్సిస్టు ఇస్లామిస్టు బృంద సభ్యులు దాడి చేశారు. 1999లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగాయి. 2009లో సంస్కరణవాదిగా పేరున్న మౌసావి ఎన్నికల్లో ఓడించబడినప్పుడు తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కోమ్ లోని కొంతమంది మత గురువులు కూడా ఇది తప్పని గార్డియన్ కౌన్సిలుకి రాశారు. ఆంక్షల వల్ల కుదేలయిన ఆర్థిక వ్యవస్థలో, గార్డియన్ కౌన్సిల్, రిపబ్లికన్ గార్డు అధికారుల అవినీతి గురించి 2017 నుంచి నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.


ఈ నిరసనలన్నింటిలోనూ ఇరానియన్ స్త్రీలు భాగమే. వారు తమని తాము ఎప్పుడూ బాధితుల్లాగా భావించుకోలేదు. రాజ్యాంగం ఇచ్చిన అన్ని హక్కులనూ వినియోగించుకుంటూ వచ్చారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య లోనూ, అన్ని ఉద్యోగాల్లోనూ సమాన స్థాయిల్లో ఉన్నారు. ఇస్లాంని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించి ఇస్లామిక్ స్త్రీవాదాన్ని రూపొందించుకున్నారు. స్త్రీల సమస్యల పైన మ్యాగజైన్లు నడిపారు. షరియా కోర్టులు పురుషులకి అనుకూల తీర్పులిస్తున్నాయని, తాము కూడా ఖొరాన్‌ని, హదీస్‌ని పూర్తి స్థాయిలో చదువుకుని, ఇస్లామిక్ న్యాయసూత్రాలు నేర్చుకుని, తమ కేసుల్ని తామే వాదించుకున్నారు. కొత్త మిలీనియం లోకి వచ్చేటప్పటికి షరియా కోర్టుల్లోని న్యాయమూర్తులు స్త్రీల హక్కులని పక్కకి పెట్టలేని స్థితికి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కువ మహిళా సినిమా దర్శకులున్నది ఇరాన్ లోనే. హసన్ రౌహానీ ఎనిమిదేళ్లలో సన్మార్గ పోలీసులని అదుపులో ఉంచటంతో యువకులతో సహా, యువతులకు కూడా రోజు వారి జీవితంలో కొంత స్వేచ్ఛ అందుబాటులోకి వచ్చింది.


క్రిందటి సంవత్సరం ఎన్నికైన ఇబ్రహీం రైసి ఆహారం, పెట్రోలు ధరల్ని కట్టడి చెయ్యకుండా, ఇతర లోటుపాట్లని బాగు చెయ్యకుండా, తానేదో అంతా కట్టడి చేస్తున్నానని చూపించుకోవటానికి, హిజాబ్ నియమాలని సన్మార్గ పోలీసుల ద్వారా కట్టడి చేస్తానని ప్రకటించాడు. ఆ తర్వాతే మెహసా అమీని కస్టోడియల్ హత్య జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మహిళలు హిజాబ్ ని రాజ్య నిరంకుశత్వానికి వ్యతిరేక చిహ్నంగా పరిగణించి నిరసిస్తున్నారు. ఈ నిరసనలో వ్యవస్థతో, ప్రభుత్వ పని తీరుతో వారికున్న అసంతృప్తి, పెరుగుతున్న ధరలు, అవినీతి పట్ల వ్యతిరేకత అన్నీ కలగలిసి ఉన్నాయి. ఇంత కాలానికి, ఎంతో కష్టపడితే వచ్చిన స్వేచ్ఛని వెనక్కి లాక్కుంటామంటే కలిగే ఆగ్రహముంది. 


ఇస్లామిక్ విప్లవ వారసత్వంలో తమకి లభించాల్సినవి లభించలేదని, దాని ఫలితాలను కొందరే స్వంతం చేసుకున్నారని, నిరంకుశ మార్గాల ద్వారా రిపబ్లిక్ నడపటం కోసం రాజ్యాంగమూ మతమూ తమకు ఇస్తున్న స్వేచ్ఛని ప్రభుత్వం లాక్కుంటున్నదనీ, అందుకు తాము ఒప్పుకోమని ఇరానియన్ స్త్రీలూ పురుషులూ ఈ నిరసనలను చేస్తున్నారు. దీన్ని ఆ దేశంలో వ్యవస్థను ప్రజాస్వామీకరించేందుకు జరిగే పోరాటంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే, ఇరాన్ స్త్రీల నిరసనలకు హిజాబ్ కేంద్ర బిందువుగా ఎందుకు మారిందో అర్థం చేసుకోగలం.


అయితే 2009, 2019లలోని నిరసనల్లాగే వీటిని కూడా ఇరాన్ ప్రభుత్వం అణచివేసే అవకాశం చాలా ఉంది. ఈ నిరసనల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 130 మంది చనిపోయారు, వేల మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఎవరి ఆచూకీ తెలియజేయడం లేదు. నిరసనలు యూనివర్సిటీలకు కూడా పాకాయి. ఇరాన్‌లో మితవాదులు, సంస్కరణ వాదులు తప్పనిసరి హిజాబ్ నియమాన్ని తీసెయ్యమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ నిరసనలు ఇంతటితో ఆగుతాయా అన్నది ప్రశ్నార్థకమే.

సునీత అచ్యుత

Updated Date - 2022-10-07T06:03:15+05:30 IST