Online Rummy: మరో విద్యార్థిని బలిగొన్న రమ్మీ
ABN , First Publish Date - 2022-10-07T15:14:22+05:30 IST
ఆన్లైన్ రమ్మీ(Online Rummy)లో నగదు కోల్పోయిన విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది.
పెరంబూర్(చెన్నై), అక్టోబరు 6: ఆన్లైన్ రమ్మీ(Online Rummy)లో నగదు కోల్పోయిన విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. మలైయాండిపట్టికి చెందిన రవి కుమారుడు సంతోష్ (22) ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ రమ్మీకి బానిసైన సంతోష్ ఈ నెల 4వ తేది డబ్బులు కావాలని తల్లిదండ్రులతో గొడవపడి ఉంగరం, కొంత డబ్బు తీసుకొని బయటకు వెళ్లాడు. ఉంగరం విక్రయించి వచ్చిన డబ్బుతో రమ్మీ ఆడిన సంతోష్ మళ్లీ డబ్బంతా పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్, ‘నా మరణానికి కారణం ఆన్లైన్ రమ్మీ అని, దానికి బానిసై అధికంగా నగదు పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని’ సెల్ఫోన్లో స్టేటస్ పెట్టి మనప్పారై కీరైతోట్టం ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.