ఆస్తి గొడవల్లో తల్లిని చంపిన తనయుడు.. ఆపై రైలు కింద దూకి..
ABN , First Publish Date - 2022-07-10T17:43:12+05:30 IST
ఆస్తి గొడవల కారణంగా తల్లిని గొంతు కోసి హత్య చేసిన కుమారుడు ఆపై రైలు కింద దూకి ఆత్మహత్యకు యత్నించాడు
ముంబై: ఆస్తి గొడవల కారణంగా తల్లిని గొంతు కోసి హత్య చేసిన కుమారుడు ఆపై రైలు కింద దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సబర్బన్ ముంబై (Mumbai)లోని ములుంద్లో జరిగిందీ ఘటన. వర్ధమాన్ నగర్లోని హౌసింగ్ సొసైటీలో నివసించే 21 ఏళ్ల జయేష్ పంచల్ ఆస్తి విషయంలో తల్లితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపం పట్టలేక పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చాడు. ఆపై ములుంద్ రైల్వే స్టేషన్లో లోకల్ రైలు కింద దూకి ఆత్మహత్య (Suicide)కు యత్నించాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని రక్షించారు.
జయేష్ ఫ్లాట్ బయట రక్తపు మరకలు ఉండడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్లో తలపులు తెరిచి లోపలికి ప్రవేశించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను చాయా పంచల్ (42)గా గుర్తించారు. ఘటనా స్థలంలో గుజరాతీలో రాసి ఉన్న నోట్తోపాటు ఓ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి విషయంలో ఒత్తిడితో తానే ఈ హత్య చేసినట్టు జయేష్ అందులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.